ముంబై: టీమిండియా యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ అతిత్వరలో స్పెషలిస్ట్ వికెట్కీపింగ్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని భారత సెలక్టన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ఎమ్మెస్కే సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్లకు భారత జట్లను సోమవారం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పంత్ రెండు సిరీస్లో మెయిన్ వికెట్కీపర్గా కొనసాగనున్నాడు. టీ20ల్లో సంజూ శాంసన్ బ్యాకప్ కీపర్గా ఉంటాడు.
పీసీబీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు.. పాకిస్థాన్ కన్నా భారతే చాలా ప్రమాదకరం!!
భారత జట్లను ఎంపిక చేసిన తర్వాత ఎమ్మెస్కే మాట్లాడాడు. 'పంత్కు మంచి ప్రతిభ ఉంది. ఈ కారణంగానే అతనికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాం. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్లలో అంతగా రాణించలేదు. విండీస్ సిరీస్లో ఆకట్టుకున్నాడు. అయితే వికెట్ కీపింగ్లో మాత్రం ఇంకా మెరుగవ్వాలి. స్పెషలిస్ట్ వికెట్కీపింగ్ కోచ్ పర్యవేక్షణలో అతడితో సాధన చేయిస్తాం. అతిత్వరలోనే శిక్షణ మొదలవుతుంది' అని ఎమ్మెస్కే తెలిపాడు.
వెస్టిండీస్ వన్డే సిరీస్లో రిషభ్ పంత్ ఫర్వాలేదనిపించాడు. తొలి వన్డేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును శ్రేయస్ అయ్యర్తో కలిసి ఆదుకున్నాడు. రెండో వన్డేలోనూ సూపర్ ఇన్నింగ్స్ ఆడి భారత్కు భారీ స్కోరు అందించాడు. తీవ్ర ఒత్తిడిలో మూడో వన్డేలో మాత్రం పరుగులు చేయలేకపోయాడు. అయితే వికెట్కీపింగ్లో మాత్రం చిన్నచిన్న తప్పిదాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా రివ్యూ విషయంలో అన్ని విఫలమయ్యాడు. ఈ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనిపై నమ్మకంగా లేడు.
పంత్ను అనవసరపు ఒత్తిడిలోని నెట్టకూడదని వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారా అంటున్నాడు. '22 ఏళ్ల పంత్పై అనవసర ఒత్తిడి నెలకొంది. ఆ వయసులో ఉన్న నేను అలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు. రిజర్వ్ బెంచ్లో ఉన్న నేను వివ్ రిచర్డ్స్కు సేవ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్కు సన్నద్ధమయ్యా. పంత్ను స్వేచ్ఛగా ఆడించాలి' అని లారా పేర్కొన్నాడు. పంత్ భారత్ తరఫున 11 టెస్టులు, 15 వన్డేలు, 26 టీ20లు ఆడాడు.