హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సరైన నిర్ణయం తీసుకుందని, క్రికెట్ సమగ్రతను కాపాడిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. బాల్ టాంపరింగ్కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇక, బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్ బాన్క్టాఫ్ట్పై తొమిది నెలల నిషేధం విధించింది. బాల్ టాంపరింగ్ వివాదాన్ని ఐసీసీ తేలిగ్గా తీసుకున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీసుకున్న నిర్ణయంపై పలువరు స్పందించారు.
'క్రికెట్ అంటేనే జెంటిల్మన్ గేమ్. ఆటను పూర్తి నిజాయితీ, నిబద్ధతతో ఆడాలన్నది నా అభిప్రాయం. ఆ ఇద్దరు బాల్ టాంపరింగ్కు పాల్పడడం దురదృష్టకరం. మ్యాచ్ను గెలవడం ప్రధానమే. కానీ, ఎలా గెలిచారన్నది ఇంకా ప్రధానం. గేమ్ స్వచ్ఛతను కాపాడడంలో భాగంగా సీఏ తీసుకున్న ఈ నిర్ణయం సరైందే' అని సచిన్ ట్విట్టర్లో తెలిపాడు.
Cricket has been known as a gentleman's game. It's a game that I believe should be played in the purest form. Whatever has happened is unfortunate but the right decision has been taken to uphold the integrity of the game. Winning is important but the way you win is more important
— Sachin Tendulkar (@sachin_rt) March 28, 2018
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఇలా:
'వాళ్లు చేసిన తప్పునకు ఏడాది శిక్ష సరిపోతుందని నేను అనుకోవడం లేదు. ఇంతకు మించిన శిక్ష ఏది పడితే బాగుంటుందా అనే ఆలోచిస్తున్నా. వాళ్లు క్రీడా స్ఫూర్తిని పూర్తిగా ఉల్లంఘించారు. అప్పట్లో మేము తప్పులు చేశాం. కానీ ఇటువంటి పనులకు దూరంగా ఉన్నాం. స్మిత్ మాత్రం క్షమించరాని తప్పు చేశాడు. అతడు శిక్ష అనుభవించాల్సిందే' అని అన్నాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ ఇలా:
'ఈ కేసులో తీసుకున్న నిర్ణయాలపై నేను సంతృప్తి చెందాను. అవి దేశ సమగ్రతను, కీర్తిని పరిరక్షించడంలో సమతుల్యత పాటించే విధంగా ఉన్నాయి. ఈ ఘటనలో పాలుపంచుకున్న ఆటగాళ్లు కఠినమైన పాఠాలు నేర్చుకుని వాటిని అధిగమించడానికి ఉపయోగపడుతాయి' అని అన్నాడు.
ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ ఇలా:
'ఎంతోమంది అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాం. నా మనసు లోతుల్లోంచి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నేను ఆ ముగ్గురి మానసిక పరిస్థితి గురించే (స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్) ఆందోళన చెందుతున్నాను. ప్రస్తుతం మేము ఆడుతున్న తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ అభిమానుల మద్దతు, అభిమానం సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్ తీవ్రమైన తప్పిదమే చేశారు. అయితే వాళ్లు చెడ్డవాళ్లు మాత్రం కాదు. అభిమానులు వారికి రెండో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను' అని అన్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇలా:
'మేమంతా క్రికెటర్లుగా గుర్తుంచుకోవాల్సిన విషయం మాలో పోటీతత్వం ఉండాలి. కానీ ఎలాగైనా విజయం సాధించాలన్న తలంపుతో ఎప్పుడూ మోసం చేయకూడదు. హద్దు దాటకూడదు. దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియా జట్టు హద్దుమీరి ప్రవర్తించింది. కేవలం ఆస్ట్రేలియన్లనే కాదు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఈ ఘటన బాధించింది' అని అన్నాడు.
తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు స్మిత్, వార్నర్, బాన్క్రాప్ట్లపై చర్యలు తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు ఏడాది పాటు, బాన్క్రాఫ్ట్ 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది.
దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్ వార్నర్ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్, బాన్క్రాఫ్ట్కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్పై రెండేళ్ల నిషేధం విధించింది.
అలాగే కెప్టెన్సీ విషయంలో బాన్క్రాఫ్ట్పైనా రెండేళ్ల నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్ క్రికెట్ ఆడుకునేందుకు అనుమతించింది.