భారత క్రికెట్ చరిత్రలో మొదటిసారి కుటుంబ నిబంధనలతో బీసీసీఐ అధికారుల మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం తెలుస్తోంది. స్వదేశీ, విదేశీ పర్యటనల సమయంలో క్రికెటర్లతో పాటు భార్య, ప్రియురాళ్ల ప్రయాణలపై నిర్ణయాన్ని వెల్లడించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలను సుప్రీం నియమిత పరిపాలకుల కమిటీ (సీఓఏ) కోరింది. సీఓఏ వారి అభిప్రాయాలను అడగడంతో బీసీసీఐ అధికారులు, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎమ్ లోధా తప్పబట్టారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్ సందర్భంగా కుటుంబ నిబంధనలను అతిక్రమిస్తూ.. టోర్నీ మొత్తం తన భార్యను వెంట ఉంచుకున్నాడని ఓ సీనియర్ క్రికెటర్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భార్యల ప్రయాణ షెడ్యూల్పై బీసీసీఐ అధికారుల మధ్య విభేదాలు చెలరేగాయి. ఆటగాళ్ల మధ్య గొడవలు వచ్చినపుడు పట్టించుకోలేదు కానీ.. ఓ సీనియర్ ఆటగాడిపై వచ్చిన ఆరోపణలపై ఇంత వేగంగా చర్చించాల్సిన అవసరం ఏముందని ఓ బీసీసీఐ అధికారి ప్రశ్నించారు.
మరోవైపు భార్యలప్రయాణ షెడ్యూల్పై వివిధ రకాల నివేదికలు రావడం బీసీసీఐ అధికారులను సందిగ్ధంలో పడేసింది. ఆటగాళ్లతో సతీమణులను అనుమంతించే సమయం ఆటగాళ్లను బట్టి ఉంటుందని.. మళ్లీ కెప్టెన్, కోచ్లకే ఆ అధికారాన్ని కల్పించడం సరికాదు అని వార్తలు వస్తున్నాయి. ఇలా భిన్నాభిప్రాయాలు రావడంతో బీసీసీఐ అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. భార్యల, ప్రియురాళ్ల ప్రయాణ విషయంలో భేదాభిప్రాయాలు రావడం భారత క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి బీసీసీఐ అధికారులు అంటున్నారు.
టీమిండియాకి చెందిన ఓ సీనియర్ క్రికెటర్ ప్రపంచకప్ టోర్నీలో బీసీసీఐ కుటుంబ నిబంధనలను ఉల్లఘించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచకప్ టోర్నీ జరుగుతున్న సమయంలో తన భార్యతో కలిసి ఉండడానికి మొదటగా ఆ సీనియర్ క్రికెటర్ బీసీసీఐ పాలకుల కమిటీని కోరాడు. మే 3న జరిగిన సమావేశంలో అధికారులు ఈ అభ్యర్థనపై చర్చించి సదరు క్రికెటర్ అభ్యర్థనను నిరాకరించారు.
బీసీసీఐ నిబంధల ప్రకారం టోర్నీ మధ్యలో 15 రోజుల పాటు జట్టులోని ప్రతీ ఆటగాడు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ క్రికెటర్ ఈ నిబంధనలను ఉల్లంఘించి టోర్నీ ఆసాంతం తన భార్యతోనే కలిసి ఉన్నాడట. ఆ సీనియర్ క్రికెటర్ తన భార్యతో కలిసి ఉండేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యంల అనుమతి కూడా తీసుకోలేదట. ఇక ఈ విషయాన్ని క్రికెట్ పాలకుల కమిటీ దృష్టికి తీసుకెళ్లి విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఓ బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.