
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఎట్టకేలకు సోషల్ మీడియాలో చేరారు. ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రికీ పాంటింగ్ బుధవారం ట్విట్టర్లో ఖాతా ప్రారంభించాడు. రికీ పాంటింగ్ పేరిట ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన పాంటింగ్ తన తొలి ట్వీట్ను కూడా పోస్టు చేశాడు.
ఆ ట్వీట్లో తన కుమారుడు ఫ్లెచర్తో కలిసి నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. తొలి రోజు పాంటింగ్ను సుమారు 13.3Kపైగా ఫోలోవర్స్ ఫాలో అయ్యారు. 44 ఏళ్ల రికీ పాంటింగ్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్గా వ్యవహారిస్తున్నాడు.
రికీ పాంటింగ్ ట్విట్టర్లో చేరిన సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అతడికి వెల్కమ్ చెప్తూ... ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో మిమ్మల్ని తిరిగి చూడటం కోసం ఎంతో ఆతృతగా ఉన్నామంటూ ట్వీట్ చేసింది.
ఆస్ట్రేలియా అత్యుత్తమ కెప్టెన్లలో రికీ పాంటింగ్ ఒకడు.
ప్రపంచ క్రికెట్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాంటింగ్(27,486) రెండో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003, 2007 వన్డే వరల్డ్ కప్లను గెలుచుకుంది. 2012లో పాంటింగ్ అన్ని ఫార్మాట్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.