పాంటింగ్ అంపైర్లా వ్యవహరించాడు.. ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్లు పట్టగానే అతడే ఔటిచ్చేవాడు: భజ్జీ

ముంబై: 2008 వివాదాస్పదమైన సిడ్నీ టెస్టులో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అంపైర్లా వ్యవహరించాడని టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. భారత బ్యాట్స్మెన్లు కొట్టిన బంతులను ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్లు పట్టగానే.. అంపైర్ కంటే ముందుగానే పాంటింగ్ ఔటిచ్చేవాడని భజ్జీ పేర్కొన్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో ఆదివారం యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన హర్భజన్.. అసలు సిడ్నీ టెస్టులో ఏం జరిగిందనే విషయాలను చెప్పాడు.

అంపైర్లా వ్యవహరించాడు:
హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... '2008 సిడ్నీ టెస్టులో అప్పటి ఆసీస్ సారథి రికీ పాంటింగే అంపైర్లా వ్యవహరించాడు. భారత బ్యాట్స్మెన్ కొట్టిన బంతులను ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్లు పట్టగానే.. అంపైర్ కంటే ముందుగానే అతడే ఔటిచ్చేవాడు. అలాగే మైదానంలో ఏం జరిగినా అది అక్కడికే పరిమితమవ్వాలని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పుడూ అంటుంటారు. కానీ నాకూ, సైమండ్స్కు మధ్య జరిగిన విషయం మాత్రం చాలా దూరం వెళ్లింది' అని అన్నాడు.

అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు:
'నేనూ, సైమండ్స్ ఎప్పుడూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. మా ఇద్దరితో సచిన్ టెండూల్కర్ మాత్రమే కలిసిపోయేవాడు. ఆ వివాదంపై నా మీద విచారణ మొదలైనప్పుడు మాత్రం మాథ్యూ హెడెన్, ఆడమ్ గిల్క్రిస్ట్, మైఖేల్ క్లార్క్, రికీ పాంటింగ్ హాజరయ్యారు. నేను సైమండ్స్తో ఏం అన్నానో విన్నామని చెప్పారు. దాంతో నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. సైమండ్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్లు అక్కడ లేరు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది సచిన్కు కూడా తెలియదు. మేం ఏం మాట్లాడుకున్నామన్నది మా ఇద్దరికే తెలుసు. తర్వాత అది వివాదాస్పదంగా మారింది. నాపై విచారణ మొదలవ్వడంతో చాలా భయపడ్డా. ఆస్ట్రేలియా మీడియా నన్ను మైఖేల్ జాక్సన్ను చేసింది. నేనెక్కడికెళ్లినా కెమెరాలతో వెంటపడ్డారు' అని భజ్జీ తెలిపాడు.

గంగూలీ ఔటైనట్లు చేతివేలు పైకెత్తాడు:
'సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో సౌరవ్ గంగూలీ (51) పరుగుల వద్ద ఉండగా.. బ్రెట్ లీ బౌలింగ్లో క్లార్క్ అస్పష్టమైన క్యాచ్ అందుకున్నాడు. దానిపై అంపైర్లకు కూడా సందేహం కలిగింది. అది ఔటా కాదా అనే విషయంపై వాళ్లకి కూడా స్పష్టత లేదు. కానీ పాంటింగ్ మాత్రం గంగూలీ ఔటైనట్లు చేతివేలు పైకెత్తాడు. దాదా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న సునీల్ గావస్కర్.. రికీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు' అని హర్భజన్ చెప్పాడు. 'మంకీ గేట్' వివాదంలో అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే తనకు అండగా నిలిచాడని భజ్జీ స్పష్టంచేశాడు. భారత ఆటగాళ్లు అందరూ కూడా తనకు మద్దతు తెలిపారన్నాడు.

122 పరుగులతో ఆసీస్ విజయం:
సిడ్నీ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 463 పరుగులకు ఆలౌటైంది. సైమండ్స్ (162) భారీ శతకం చేశాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 532 పరుగులు చేసింది. లక్ష్మణ్ (109), సచిన్ (154) సెంచరీలు చేసారు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 401/7 పరుగులు చేసింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 210 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టు 122 పరుగులతో విజయం సాధించింది. 'మంకీ గేట్' వివాదం గురించి తెలియని క్రికెట్ ప్రేమికులుండరంటే అతిశయోక్తి కాదు. హర్భజన్, సైమండ్స్ల మధ్య మైదానంలో చోటుచేసుకున్న ఈ వివాదం అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

జాతివివక్ష వ్యాఖ్యలు
2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్లో హర్భజన్ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో రిఫరీ హర్భజన్పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని స్పష్టం చేసిన అప్పటి భారత్ ఆటగాళ్లు.. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్కు సచిన్ మద్దతుగా నిలవడంతో అతను ఈ శిక్షను రద్దు చేశారు.
ఎందుకో తెలియదు.. హార్దిక్ పాండ్యా స్లెడ్జింగ్ చేసాడు: గిల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications