నీతా అంబానీ పర్యవేక్షణలో..
ఈ ఫ్రాంఛైజీ ఓనర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ ఈ ఫ్రాంఛైజీకి యజమాని. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తోన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్లల్లో ప్రతి మ్యాచ్ను ఆమె తన పిల్లలతో కలిసి ప్రత్యక్షంగా వీక్షిస్తుంటారు. ఆటను ఎంజాయ్ చేస్తుంటారు. క్రికెట్ పట్ల ఆమెకు ఉన్న అభిరుచిని ఇది ప్రతిబింబిస్తుంటుంది.
యూఏఈ టీ20 లీగ్ ఫ్రాంఛైజీ కూడా..
కాగా- ఇప్పుడు మరో ఫ్రాంఛైజీని కొనుగోలు చేయనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ ఫ్రాంఛైజీని కూడా రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కిందికే తీసుకుని రానుంది. అదే- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టీ20 లీగ్. ఇందులో ఓ ఫ్రాంఛైజీని సొంతం చేసుకోనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ ఆధీనంలో త్వరలో ఆరంభం కాబోతోన్న యూఏఈ టీ20 లీగ్లో ఈ ఫ్రాంఛైజీ ఒకటి. ప్రారంభంలో మొత్తం ఆరు ఫ్రాంఛైజీలతో ఈ లీగ్ టోర్నమెంట్ మొదలు కావచ్చని తెలుస్తోంది.
విదేశీ ఫ్రాంఛైజీని కొనడం ఇదే తొలిసారి..
పాకిస్తాన్, వెస్టిండీస్ వంటి చోట్ల ఇప్పటికే ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లు నడుస్తున్నాయి. అదే జాబితాలో తాజాగా యూఏఈ చేరబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డును ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. యూఏఈ టీ20 లీగ్ టోర్నమెంట్ను మొదలు పెట్టబోతోంది. ఇందులో ఓ ఫ్రాంఛైజీని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనుంది. విదేశాల్లో నిర్వహించే టీ20 లీగ్ టోర్నమెంట్లకు సంబంధించిన ఫ్రాంఛైజీని రిలయన్స్ కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి.
రిలయన్స్కు థ్యాంక్స్..
ఈ విషయాన్ని యుఏఈ టీ20 లీగ్ ఛైర్మన్, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ ఛైర్మన్ ఖలీద్ అల్ జరూనీ నిర్ధారించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఈ లీగ్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. తమ దేశంలో క్రికెట్ను మరింత ప్రోత్సహించడంలో భాగంగా టీ20 లీగ్ టోర్నమెంట్లను మొదలు పెట్టబోతోన్నామని, రిలయన్స్ వంటి బిగ్ షాట్.. పెట్టుబడులు పెట్టనుండటం హర్షించదగ్గ విషయమనీ చెప్పారు. ఈ టోర్నమెంట్ వల్ల దేశీయ క్రికెటర్లకు అద్భుతమైన అవకాశం లభిస్తుందని అన్నారు.
యూఏఈలో క్రికెట్కు గుడ్ రెస్పాన్స్..
యూఏఈలో క్రికెట్కు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే 2020 సహా, 2021 ఐపీఎల్ టోర్నమెంట్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఆ దేశంలో నిర్వహించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. వరుసగా రెండు సంవత్సరాల పాటు ఐపీఎల్ టోర్నమెంట్స్ అక్కడే ముగిశాయి. దీనితో పాటు దుబాయ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను అక్కడే ఏర్పాటు చేసింది. అబుధాబి, దుబాయ్, షార్జాల్లో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి.