తాజాగా ఐపీఎల్ సీజన్-12లో జరిగిన ఓ ఘటన నవ్వులు పూయించింది. మైదానంలోని అంపైర్ మతిమరుపు కారణంగా బంతిని జేబులోనే ఉంచుకోవడంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది. అనంతరం బంతి ఎక్కడవుందో తెలుసుకున్న మైదానంలోని ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ ఘటన బంగళూరు వేదికగా బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చోటుచేసుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బెంగళూరు బ్యాటింగ్ చేస్తోంది. 14వ ఓవర్ వేసేందుకు పంజాబ్ బౌలర్ అంకిత్ రాజ్పుత్ వచ్చాడు. బంతి కనిపించకపోవడంతో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ను అడిగాడు. అశ్విన్ అందరినీ అడిగినా.. బంతి కనిపించలేదు. దీంతో అంపైర్ శంషుద్దీన్ను అశ్విన్ సంప్రదించాడు. అందరూ బంతి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఇక చేసేదేంలేక అంపైర్లు కొత్త బంతి తీసుకురావాలని కోరారు.
ఇదే సమయంలో థర్డ్ అంపైర్ బంతి కోసం మైదానంలోని బిగ్ స్క్రీన్లో రిప్లే వేశాడు. ఆ వీడియోలో.. 'మరో అంపైర్ బ్రూస్ ఆక్సెన్ఫర్డ్ స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ ప్రకటించి శంషుద్దీన్కి బంతిని ఇచ్చాడు. శంషుద్దీన్ బంతిని జేబులోనే వేసుకుని మరిచిపోయాడు'. ఇదంతా రిప్లేలో చూసిన ఆటగాళ్లు, మైదానంలో ప్రేక్షకులు నవ్వుకున్నారు. ఇక అంపైర్ శంషుద్దీన్ కొత్త బంతిని తీసుకొస్తున్న సిబ్బందిని వెనక్కి పంపి తన దగ్గర ఉన్న బంతిని బౌలర్కు ఇచ్చాడు. దీనికి సంబందించిన వీడియోను ఐపీఎల్ యాజమాన్యం అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.