జడ్డూ గాయం.. టీమిండియాకు శాపం..
ఆసియా కప్లో ఆడుతున్న సమయంలోనే రవీంద్ర జడేజా మోకాలి గాయం తిరగబెట్టింది. దీంతో బౌలింగ్ చేయడం కూడా కష్టంగా మారడంతో అతను ఆసియా కప్ మధ్యలోనే జట్టును వీడి ఆస్పత్రికి వెళ్లాడు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ కారణంగానే అతను టీ20 వరల్డ్ కప్, న్యూజిల్యాండ్ పర్యటనలకు దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్లో అతనుల లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే బంగ్లా పర్యటన సమయానికి జడ్డూ కూడా పూర్తిగా కోలుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు.
టెస్టుల్లో కీలకపాత్ర..
భారత టెస్టు జట్టులో జడేజాది ఎంతో కీలకమైన పాత్ర. బంతితో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఈ ఫార్మాట్లో జట్టుకు ప్రధాన స్పిన్నర్లా మారిన జడ్డూ.. ఇప్పటి వరకు ఆడిన 60 టెస్టు మ్యాచుల్లో 242 వికెట్లు తీసుకున్నాడు. వీటిలో పదిసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు కూడా. ఇక బ్యాటుతో అతను జట్టుకు ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. గాయానికి ముందు సూపర్ ఫామ్లో ఉన్న అతను.. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. తన టెస్టు కెరీర్లో 36.56 సగటుతో 2523 పరుగులు చేశాడు.
టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే..
చివరిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరిన భారత జట్టు.. చివరి మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈసారి ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్ చేరడం కూడా కష్టంగా కనపడుతోంది. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో ఓటమిపాలైన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో కూడా ఓడింది. దీంతో ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ రేసులో నాలుగో స్థానంలో ఉంది.
ఇక్కడి నుంచి ఆడే ఆరు టెస్టుల్లో గెలిస్తేనే భారత్కు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో బంగ్లా పర్యటనకు జడ్డూ దూరమవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. అయితే ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ నాటికి జడ్డూ కోలుకుంటాడని, జట్టుతో కలుస్తాడని సమాచారం.