
చెన్నై: టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. అశ్విన్ కుటుంబంలో పది మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని యాష్ సతీమణి ప్రీతి అశ్విన్ శుక్రవారం వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం అర్ధరాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో ముగిసిన మ్యాచ్ అనంతరం లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు తెలిపాడు.
'ఓకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్లకు, నలుగురు పిల్లలకు కరోనా పాజిటివ్గా తేలింది. పిల్లల కారణంగా అందరికీ వైరస్ అంటుకుంది. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడంతో గత వారం ఓ పీడకలలా గడిచింది. చాలా బయమేసింది. ఇప్పుడు అందరూ బాగున్నారు. అశ్విన్ ఇంటికి చేరడంతో కాస్త ధైర్యం వచ్చింది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి' అని ప్రీతి శ్విన్ తన ట్వీట్లలో పేర్కొన్నారు.
'రేపటి నుంచి ఐపీఎల్ 2021కి విరామం ఇస్తున్నా. నా కుటుంబ సభ్యులు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ కఠినమైన సమయాల్లో నేను వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నా. అన్ని సవ్యంగా ఉంటే.. ఐపీఎల్ 2021కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ఢిల్లీ ప్రాంచైజీకి ధన్యవాదాలు' అని ఆర్ అశ్విన్ గత ఆదివారం ట్వీట్ చేశాడు. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఉండాలనే ఐపీఎల్ నుంచి అతడు తపుకున్నాడు.
ఆర్ అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తోంది. అంతకుముందు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడిన యాష్.. గతేడాది నుంచి ఢిల్లీకి ఆడుతున్నాడు. అశ్విన్ సుదీర్ఘ కాలం చెన్నైకి ఆడిన విషయం తెలిసిందే. యాష్ ఐపీఎల్ టోర్నీలో 159 మ్యాచుల్లో 139 వికెట్లు పడగొట్టాడు.