మంచి పిచ్ అంటే ఏంటీ?
'బ్యాట్కు, బంతికి మధ్య సమంగా పోరాటం జరగాలని అంతా అంటారు కానీ అసలు మంచి పిచ్ అంటే ఏమిటి? ఆటలో బౌలర్లు వికెట్ తీయాలనుకుంటే బ్యాట్స్మెన్ పరుగులు తీసేందుకు ప్రయత్నించడం సహజం. మంచి పిచ్ అంటే ఏమిటో ఎవరు వివరిస్తారు. ఆరంభంలో పేస్కు అనుకూలించి ఆపై బ్యాటింగ్కు, చివరి రోజుల్లో స్పిన్కు అనుకూలించాలా? అసలు ఎవరు ఈ నిబంధనలు రూపొందించారు. ప్రతీ ఒక్కరికి తమ అభిప్రాయం ఉండవచ్చు కానీ దానిని ఇతరులపై రుద్దితే ఎలా? పిచ్లపై చర్చ చేయి దాటిపోతోంది. దీనిని ఆపి తీరాలి. మేం మరో దేశంలో ఆడినప్పుడో, మరో పిచ్ గురించి ఇంత చర్చ జరిగిందా? న్యూజిలాండ్తో మేం ఆడిన రెండు టెస్టులు కలిపి ఐదు రోజుల్లో ముగిసిపోయాయి. ఎవరైనా మాట్లాడారా? అయితే ఇలాంటి ఆలోచనాధోరణి నన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే దశాబ్దకాలంగా ఇది జరుగుతూనే ఉంది' అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
యువీ ట్వీట్లో తప్పు లేదు
మొతెరా వికెట్ గురించి మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్పై కూడా అశ్విన్ స్పందించాడు. 'యువరాజ్ చేసిన ట్వీట్ నేను కూడా చూశా. తనంటే చాలా గౌరవం ఉంది. ఆ ట్వీట్లో నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం కనిపించలేదు. మనలో చాలా మంది ఎవరో చెప్పింది విని అదే నిజమనే భ్రమలో ఉంటున్నారు. అలాంటి వాళ్లలో పిచ్ వల్లే టీమ్ గెలిచిందని నమ్ముతున్న వారిని ఉద్దేశించే నేను ట్వీట్స్ చేశా. సరిగ్గా చెప్పాలంటే మనం చూసిన ఓ మ్యాచ్లో భారత్ గెలిచిందంటే.. చాలామంది భారత్ గెలిచిందని సంతోషపడతారు. అదో గొప్ప ఫీలింగ్. కానీ ఇండియా కాదు పిచ్ గెలిపిస్తోందని అనే వాళ్లు కొందరు ఉంటారు. ఇలాంటి ఆలోచన అస్సలు ఉండకూడదు. కానీ అదే ఎక్కువ అవుతోంది' అని అశ్విన్ పేర్కొన్నాడు.
మైలురాళ్ల గురించి ఆలోచనే లేదు..
టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్ల మైలు రాయిని దాటిన అశ్విన్ .. అనిల్ కుంబ్లే 619 వికెట్ల ఘనతకు ఇంకా 218 వికెట్ల దూరంలో ఉన్నాడు. కుంబ్లే రికార్డును బ్రేక్ చేస్తారా అనే ప్రశ్నకు స్పందించిన అశ్విన్ మైలురాళ్ల గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైందని అన్నాడు. 'నేను మైల్ స్టోన్స్ గురించి ఆలోచించడం మానేసి చాలా ఏళ్లు అయింది. నా ప్రదర్శన ఎలా ఉంది. జట్టు విజయానికి నేనే చెయ్యాలి వంటి విషయాల గురించే ఆలోచిస్తా. ఎందుకంటే కొంతకాలంగా నేను టెస్టులకే పరిమితమయ్యా. అందువల్ల అవకాశం వచ్చిన ప్రతీసారి జట్టు కోరుకున్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఓ వ్యక్తిగా, క్రికెటర్ గా ఎలా ఎదగాలనే దానిపైనే నా ఫోకస్ ఉంటుంది. దాని వల్లే చాలా హ్యాపీగా ఉంటున్నా. క్రికెట్ను ఆస్వాదిస్తున్నా. ఇదే పద్ధతిని కొనసాగిస్తా'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.