టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ జోహన్నెస్ బర్గ్ టెస్టులో మొదటి రోజు ఆటలో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతను మధ్యలోనే గ్రౌండ్ను వీడాడు. తన నాలుగో ఓవర్లో చివరి బంతిని వేస్తుండగా.. గాయంతో బాధపడ్డాడు. తన కుడి కాలు తొడను పట్టుకుని ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడిని ఫిజియోథెరపీ నితిన్ పటేల్ గ్రౌండ్ నుంచి బయటికి తీసుకెళ్లాడు. ఆ ఓవర్ చివరి బంతిని శార్దూల్ ఠాకూర్ పూర్తి చేశాడు. దీంతో రెండో రోజు ఆటలో సిరాజ్ బరిలోకి దిగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై టీమ్ మేనేజ్మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. సిరాజ్ గాయం గురించి మాట్లాడాడు. సిరాజ్ను వైద్య సిబ్బంది పరీక్షిస్తున్నారని తెలిపాడు. సిరాజ్ గాయంపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుందని చెప్పాడు. అంతేకాకుండా సిరాజ్ మంచి సత్తా ఉన్న బౌలర్ అని ఈ సందర్భంగా అశ్విన్ కొనియాడాడు. సిరాజ్ మళ్లీ మైదానంలోకి తిరిగొచ్చి తన బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇస్తాడని అశిస్తున్నట్టు పేర్కొన్నాడు.
కాగా తొలి రోజు ఆటలో గాయపడిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తిరిగి ఆడేది లేనిది నేడు తేలనుంది. తొలి రోజు ఆటలో 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. రెండు ఓవర్లు మెయిడిన్ చేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే తొలి టెస్టు మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. ఒక వేళ సిరాజ్ కనుక ఈ మ్యాచ్లో తిరిగి ఆడకుంటే టీమిండియాకు సమస్యలు తప్పకపోవచ్చు. అప్పుడు నలుగురు బౌలర్లే అవుతారు. ముఖ్యంగా పేస్ భారమంతా బుమ్రా, షమీ మీద పడనుంది. సిరాజ్ మూడో టెస్టు మ్యాచ్ ఆడకుంటే అతడి స్థానాన్ని ఉమేష్ యాదవ్ లేదా ఇషాంత్ శర్మ భర్తీ చేస్తారు.
ఇక టెస్టు మ్యాచ్ విషయానికొస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్(11), పీటర్సన్(14) ఉన్నారు. భారత్ కన్నా ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 202 పరుగులు చేసింది. రాహుల్ (50), అశ్విన్ (46) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో వీలైనంత త్వరగా ఆలౌట్ చేసి.. సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ సాధిస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.