గుండప్ప విశ్వనాథ్తో ఆడాలన్నది నా కల
ఇక, టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం గుండప్ప విశ్వనాథ్తో ఆడాలన్నది తన కల అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. "1970, 80ల్లో గుండప్ప విశ్వనాథ్ ఎందరికో ఆదర్శం. 30 లేదా 40 పరుగులు చేయడానికి ఆటగాళ్లు ఇబ్బంది పడే మైదానాల్లో గుండప్ప సెంచరీల మీద సెంచరీలు బాదేవాడు. అతడు ఎంతో గొప్ప ఆటగాడు" అని పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో నా కల నిజమైంది
"అలాంటి ఆటగాడితో కలిసి మైదానంలో ఆడాలని కలలు కంటుండేవాడిని. ఇంగ్లాండ్ పర్యటనలో నా కల నిజమైంది. ఓవెల్ మైదానంలో జరిగిన ఓ మ్యాచ్లో నేనూ, దిలీప్ వెంగ్ సర్కార్లు ఓపెనర్లుగా దిగాం. దిలీప్ ఔటైన అనంతరం గుండప్ప క్రీజులోకి వచ్చాడు. నా జీవితంలో గొప్ప హీరో అతడు. కేవలం 22 యార్డ్స్ దూరం నుంచి అతని ఆటను చూశాను. ఇదో గొప్ప అనుభవం" అని రవిశాస్త్రి చెప్పాడు.
బీర్ తాగుతూ ఇన్ఛార్జ్కి దొరికిపోయా
అంతేకాదు తాను అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో ఒకసారి బీర్ తాగుతూ ఇన్ఛార్జ్కి దొరికిపోయిన సందర్భాన్ని రవిశాస్త్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. "బాగా ఆడాలి.. ఆ తర్వాత పార్టీ చేసుకోవాలి. ఇదే మొదటి నుంచి నా సిద్ధాంతం. అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో ఒకసారి ఏం జరిగిందంటే.. నేను బీర్ తాగుతుంటే ఇన్ఛార్జ్ చూశాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి నా చేతిలో ఉన్న సీసాను తీసుకున్నాడు" అని అన్నాడు.
భయపడకుండా ఆయన్ని పిలిచి బాటిల్ను తీసుకున్నా
"అప్పటికి బాటిల్ సగం మాత్రమే ఖాళీ అయ్యింది. నేను ఏమాత్రం భయపడకుండా ఆయన్ని పిలిచి బాటిల్ను తీసుకున్నాను. మిగిలి ఉన్న మందును గ్లాసులో పోసుకుని ఖాళీ బాటిల్ ఇచ్చి తీసుకుని వెళ్లమన్నాను. ఆ తర్వాత రోజు నాకు సమన్లు అందాయి. అప్పుడు వారితో ఒకటే అన్నాను. నేను ఎంతగానో గౌరవించే నా తండ్రితో కలిసి మందు తాగుతా. మందు తాగిన ప్రభావం ఎప్పుడైనా మైదానంలో కనిపిస్తే, నన్ను బయటకు పంపించండి. అంతేకానీ, ఆ కారణంతో నన్ను బయటకు వెళ్లమని చెప్పడం సరికాదు" అని చెప్పినట్లు రవిశాస్త్రి తెలిపాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో రవిశాస్త్రి
భారత క్రికెటర్గా, జట్టు మేనేజర్గా, కామెంటేటర్గా రవిశాస్త్రి ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రవిశాస్త్రి టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.