కొత్త నిబంధనలు:
అయితే ఈ సారి కొత్తగా వయసు, ఎక్స్పీరియన్స్ లాంటి నిబంధనలను విధించింది. హెడ్ కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది. దీని ప్రకారం.. కోచ్ పదవికి ఎంపిక అయ్యే అభ్యర్థికి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు లేదా అసోసియేట్ సభ్యదేశం/ ఏ-జట్టు/ఐపీఎల్ జట్టుకు మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. దీంతో పాటు ఆ అభ్యర్ధికి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం కూడా ఉండాలని నిబంధన పెట్టింది.
ఎందరు ఉన్నా..:
ప్రస్తుతం టీమిండియాకు కొనసాగుతున్న కోచింగ్ బృందం కూడా హెడ్ కోచ్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్కు సంబంధించి పదవుల ఎంపిక ప్రక్రియలో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా మరలా దరఖాస్తు చేసుకోనున్నాడు. టీమిండియా కోచ్ పదవికి పోటీ పడుతున్న వారిలో టామ్ మూడీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో కూడా మూడీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా నిలిపిన ట్రెవర్ బేలిస్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనేలు పోటీపడుతున్నారు. అయితే ఎందరు ఉన్నా.. రవిశాస్త్రికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆటగాళ్లతో రవిశాస్త్రికి మంచి సంబంధాలు ఉన్నాయి. శాస్త్రి హయాంలో భారత్ మంచి విజయాలు కూడా అందుకుంది. మరోవైపు బీసీసీఐ మద్దుతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అతనికే ప్రాధాన్యత:
'శాస్త్రి కోచ్గా నియామకమైన నాటి నుంచి జట్టు కోసం శ్రమించాడు. జట్టులోని ఆటగాళ్లందరితో మంచి సమన్వయం ఉంది. టీమిండియా టెస్టుల్లో మొదటి స్థానంలో, వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవే అతన్ని కోచ్గా నిరూపించాయి. ప్రపంచకప్లోని ఒక్క ఓటమితో అతనిని దూరం చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఒకవేళ అతను కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అతనికే ప్రాధాన్యత ఉంటుంది' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. అన్ని శాస్త్రికే అనుకూలంగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
2014లో జట్టు డైరెక్టర్గా:
బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ హయాంలో రవిశాస్త్రి మొదటిసారిగా 2014 ఆగస్టులో భారత జట్టు డైరెక్టర్గా నియమించబడ్డాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ పర్యటన జరుగుతోంది. అప్పటికే డంకన్ ఫ్లెచర్ కోచ్గా విఫలమయ్యాడు, ప్రపంచకప్ 2015 దగ్గరలో ఉండడంతో రవిశాస్త్రి పగ్గాలు అందుకున్నాడు. అనిల్ కుంబ్లే అనంతరం 2017లో హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు.