ముంబై: ఐపీఎల్ 2022లో సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్న ప్లేయర్లల్లో రిషభ్ పంత్ ఒకడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్, కేన్ విలియమ్సన్, ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్.. ఇలా చాలామంది ఐపీఎల్ స్పెషలిస్టులు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నారు. బ్యాట్లెత్తేస్తోన్నారు. కోట్లాది రూపాయల మేర ఫ్రాంఛైజీలు ఇన్వెస్ట్ చేసిన మొత్తం వృధా అవుతోంది. జట్ల జయాపజయాల మీద దాని ప్రభావం పడుతోంది.
ఢిల్లీ కేపిటల్స్ కేప్టెన్ రిషభ్ పంత్ కూడా ఈ జాబితాలో ఉన్నావాడే. ఇదివరకట్లా అతను విరుచుకుపడట్లేదు. క్రీజ్లో స్వేచ్ఛగా ఆడట్లేదు. ఒత్తిడి కదులుతున్నాడు. కేప్టెన్సీ భారాన్ని అతను మోయలేకపోతున్నాడనేది స్పష్టమౌతోంది. మూడుసార్లు 40 ప్లస్ స్కోర్ చేసినప్పటికీ- దాన్ని ఆర్ధసెంచరీగా మలచుకోలేకపోయాడు. ఐపీఎల్ లీగ్ దశ ముగింపు దశకు వచ్చేసినప్పటికీ.. రిషభ్ పంత్ బ్యాట్ నుంచి ఒక్క భారీ ఇన్నింగ్ కూడా జాలువారలేదు. ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు.
అతను విఫలమౌతుండటం జట్టు విజయావకాశాలను సైతం దెబ్బతీస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి విలువైన సలహాలు ఇచ్చాడు రిషభ్ పంత్కు. బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో తాను కేప్టెన్ అనే విషయాన్ని మరిచిపోవాలని అన్నాడు. కోల్కత నైట్రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ను చూసి పాఠాలు నేర్చుకోవాలని స్పష్టం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆండ్రీ రస్సెల్ కూల్గా ఉంటాడని, దాన్ని రిషభ్ పంత్ అలవరచుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు.
రిషభ్ పంత్ ఒక్కసారి టెంపో అందుకుంటే- పరిస్థితులు అన్నీ వాటికవే సర్దుకుంటాయని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఆండ్రీ రస్సెల్ తరహాలో రిషభ్ తనను తాను మార్చుకోవాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫార్మట్లకు రస్సెల్ ఆటతీరు అతికినట్టు సరిపోతుందని, అతనిలాగా స్వేచ్ఛగా షాట్లను ఆడటాన్ని అలవాటు చేసుకోవాలని అన్నాడు. బౌలర్ ఎవరు?, ఎలాంటి బంతులను సంధిస్తున్నాడనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బంతిని సరిగ్గా కనెక్ట్ చేస్తూ స్వేచ్ఛగా షాట్లను ఆడాలని సూచించాడు.
ఢిల్లీ కేపిటల్స్కు రిషభ్ పంత్ నాయకత్వాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఆశించదగ్గ స్థాయిలో ఉండట్లేదా ఫ్రాంఛైజీ పెర్ఫార్మెన్స్ కూడా. ఇప్పటివరకు 11 మ్యాచ్లను ఆడిన ఢిల్లీ కేపిటల్స్ ఆరింట్లో ఓడింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్న పాయింట్లు 10. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. తన తదుపరి మ్యాచ్లల్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్తో మిగిలిన మ్యాచ్లను ఆడాల్సి ఉంది.