న్యూజిల్యాండ్తో జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా 12.5 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసింది. ఆడింది తక్కువ సమయమే అయినా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ మరోసారి ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతను.. రెండో వన్డేలో 42 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇటీవలి కాలంలో యువ ఆటగాళ్లంతా బంతిని బలంగా బాదుతూ, భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ గిల్ మాత్రం వాళ్లకు భిన్నంగా బంతిని టైమింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
ఇదే విషయాన్ని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఎత్తిచూపాడు. గిల్ ఆటలో ఒక హుందాతనం ఉందని, అది చూసేవాళ్లను ఇట్టే కట్టిపడేస్తుందని కొనియాడాడు. ఈ కుర్రాడు కనీసం పదేళ్లు ఇలాగే అద్భుతంగా ఆడతాడని మెచ్చుకున్నాడు. 'ఈరోజు ఆటలో బంతిని టైమింగ్ చేయడం మీదనే ఫోకస్ పెట్టాడు. ఒక్కోసారి మనలో సత్తా తగ్గిందేమో అని అనుమానం వస్తే.. బంతిని బలంగా బాదుతూ ఆ ఫీలింగ్ నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ గిల్ మాత్రం మంచి కంట్రోల్లో కనిపించాడు. దానికితోడు అద్భుతమైన ఫుట్ వర్క్ కనబరిచాడు. తను ఆడుతుంటే చూడటం కూడా చాలా మంచి ఫీలింగ్ పంచుతుంది. తనో క్వాలిటీ ప్లేయర్. చాలా కాలం ఈ ఆటలో ఉంటాడు. తనలో ఈ ఆట పట్ల మంచి నిబద్ధత కనబడుతోంది. కష్టపడుతున్నాడు. ఆటపై ఆకలి ఉంది. అన్నిటికన్నా మించి క్రికెట్ అంటే ప్రేమ ఉంది' అని మెచ్చుకున్నాడు.
ఆ మధ్య కాలంలో టీమిండియా టెస్టు ఓపెనర్గా మంచి అవకాశాలు లభించినా భారీ స్కోర్లు చెయ్యలేక గిల్ తడబడేవాడు. హాఫ్ సెంచరీలు ఎన్ని చేసినా.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయేవాడు. అలాంటి సమయంలో ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్తో జతకలవడం అతనికి కలిసొచ్చింది. ఆ జట్టు ఓపెనర్గా అద్భుతంగా రాణించాడు. అప్పటి నుంచి ఈజీగా హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ సెంచరీ కూడా బాదాడు. కివీస్తో జరిగిన తొలి వన్డేలో కూడా సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ హాఫ్ సెంచరీ పూర్తవగానే పెవిలియన్ చేరాడు.