గ్యాలరీలో కూర్చుని ఉన్న రవిశాస్త్రి కునుకు
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం తొలి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. లంచ్ విరామం అనంతరం మ్యాచ్ జరుగుతోన్న సమయంలో గ్యాలరీలో కూర్చుని ఉన్న రవిశాస్త్రి కునుకు తీస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఆ సమయంలో హర్భజన్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు.
— Hit wicket (@sukhiaatma69) August 1, 2018 |
రవి నిద్ర నుంచి మేలుకో
"రవిశాస్త్రి నిద్రపోతున్నాడు. రవి నిద్ర నుంచి మేలుకో" అని కామెంటరీ గదిలో హర్భజన్ చెప్పడంతో నవ్వులు విరిశాయి. భజ్జీ అక్కడితో ఊరుకోకుండా రవిశాస్త్రి పక్కన ఉన్న మరో కోచ్ సంజయ్ బంగర్కు ఓ విన్నపం చేశాడు. తన మెసేజ్ను రవికి చెప్పాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత రవిశాస్త్రికి సంజయ్ బంగర్ స్పీకర్ను అందించడంతో తాను శ్వాస పీల్చుతూ, వదులుతూ మెడిటేషన్ చేస్తున్నట్లు సైగలు చేస్తూ తెలిపాడు.
|
రవిశాస్త్రిని ఉద్దేశించి భజ్జీ కామెంట్
"నీ అంత బాగా నేను కామెంటరీ చేయలేను. రేపు వచ్చి నీ దగ్గర నేర్చుకుంటా" అని రవిశాస్త్రిని ఉద్దేశించి భజ్జీ అన్నాడు. దీంతో మరోసారి కామెంటేటర్లంతా నవ్వుకున్నారు. ‘టెస్టు మ్యాచ్ చూసే సమయంలో నిద్ర రావడం సహజం' అని కొందరు, జట్టు ఆడుతుంటే కోచ్ మ్యాచ్ చూడకుండా నిద్రపోతున్నాడు' అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తొలిరోజు భారత్దే పైచేయి
ఇదిలా ఉంటే ఎడ్జ్బాస్టన్లో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్ట్ తొలిరోజు భారత్దే పైచేయిగా నిలిచింది. ఇంగ్లీషు గడ్డపై అశ్విన్ అద్భుత ప్రదర్శనకు తోడు పేసర్లు కూడా రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 285/9కే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ను కెప్టెన్ రూట్ (80; 156 బంతుల్లో 9 ఫోర్లు), బెయిర్ స్టో (70; 88 బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు. నాలుగో వికెట్కు వీరిద్దరూ 104 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. జెన్నింగ్స్ (98 బంతుల్లో 4 ఫోర్లతో 42) ఫరవాలేదనిపించారు. స్పిన్నర్ అశ్విన్ (4/60), షమీ (2/64) సత్తాచాటగా ఉమేష్, ఇషాంత్ చెరో వికెట్ పడగొట్టారు.