ఒకే కెప్టెన్ కష్టం..
పొట్టి ఫార్మాట్లో కొత్త కెప్టెన్ విషయంలో మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇటీవలి కాలంలో క్రికెట్ షెడ్యూల్ చాలా బిజీగా మారిందన్న అతను.. ఇంత బిజీ షెడ్యూల్లో మూడు ఫార్మాట్లలో ఒకే ఆటగాడు ఆడటం కష్టమని, కాబట్టి పొట్టి ఫార్మాట్లో కొత్త కెప్టెన్ వచ్చినా పర్వాలేదని అన్నాడు. ఇలా కొత్త కెప్టెన్ను నియమించడం వల్ల జట్టుకు ఎలాంటి నష్టం ఉంటుందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశాడు.
ఎవరైతే ఏంటి?
రోహిత్ శర్మ ఇప్పటికే వన్డేలు, టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.. న్యూజిల్యాండ్ సిరీస్లో జట్టు టీ20 సిరీస్లో కెప్టెన్గా పాండ్యను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమర్థించిన రవిశాస్త్రి.. 'టెస్టు, వన్డేల్లో రోహిత్ కెప్టెన్గా ఉన్నాడు. అలాంటి సమయంలో టీ20 ఫార్మాట్కు కొత్త కెప్టెన్ను వెతకడంలో తప్పేం లేదు. అతని పేరు హార్దిక్ పాండ్యా అయితే ఏంటి? అవ్వనివ్వండి' అని చెప్పాడు.
మిగతా జట్లు కూడా..
ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు వేరు వేరు ఫార్మాట్లకు వేరు వేరు కెప్టెన్లతో రాణిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ జట్టు పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా కూడా నిలిచింది. ఆస్ట్రేలియా కూడా ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ను కెప్టెన్లుగా ఉంచింది. ఇప్పుడు భారత్ కూడా అదే మార్గంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం రిషభ్ పంత్, పాండ్యా, రాహుల్ ముగ్గురిలో ఎవరిని కెప్టెన్గా నియమించాలని అనుమానం ఉండేది. కానీ ఆటగాడిగానే కాక, కెప్టెన్గా కూడా సత్తా చాటిన పాండ్య వైపే బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.