ఐదుగురు సభ్యులనే ఇంటర్వ్యూ చేసిన క్రికెట్ సలహా కమిటీ
ఈ క్రమంలో ఇంటర్వ్యూలు మొదలైన కొద్దిసేపటికే కోచ్ రేసు నుంచి ఫిల్ సిమ్మన్స్ తప్పుకున్నాడు. అయితే, వ్యక్తిగత కారణాలతో ఫిల్ సిమ్మన్స్ ఇంటర్వ్యూకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిసింది. దీంతో కోచ్ రేసులో షార్ట్ లిస్ట్ అయిన మిగతా ఐదుగురు సభ్యులను క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూ చేసింది. దీంతో ఐదుగురిలో కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ సలహా కమిటీ మళ్లీ రవిశాస్త్రికే పట్టం కట్టింది.
కోచ్గా రవిశాస్త్రినే కొనసాగిస్తూ నిర్ణయం
కోచ్గా అతడినే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ కోహ్లీ బహిరంగంగానే రవిశాస్త్రికి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కమిటీ సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ సైతం అతడి పట్ల సానుకూలత వ్యక్తం చేశాడు. దీంతో అందరూ ఊహించినట్లే రవిశాస్త్రే మళ్లీ కోచ్ పదవి దక్కించుకున్నాడు. అందుకు కారణంగా కోచ్గా రవిశాస్త్రి ట్రాక్ రికార్డే.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమిండియా
రవి శాస్త్రి కోచింగ్లోనే టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. భారత జట్టులోని ఆటగాళ్లందరితో రవిశాస్త్రికి మంచి సంబంధాలు ఉండటం కలిసొచ్చింది. రవిశాస్త్రి కోచ్గా ఎంపికైనప్పటి నుంచి (జులై 2017) భారత్ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్లలో 25 సొంతం చేసుకుంది.
రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న శాస్త్రి
కొత్త కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. భారతదేశం ఆతిథ్యమిస్తోన్న 2021 టీ20 ప్రపంచకప్ వరకు ప్రధాన కోచ్గా రవిశాస్త్రినే కొనసాగనున్నాడు. రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసన్, లాల్చంద్ రాజ్పుత్, రాబిన్ సింగ్, ఫిల్ సిమన్స్ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.