హైదరాబాద్: అఫ్గానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్కు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓ సలహా ఇచ్చాడు. భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేతో ఎల్లప్పుడూ టచ్లో ఉండాలంటూ సూచించాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న రషీద్కు కుంబ్లేతో తరచూ టచ్లో ఉండమంటూ హితవు పలికాడు.
ఐపీఎల్తో పాటు బిగ్బాష్ లీగ్, కరేబియన్ ప్రిమియర్ లీగ్ల్లో కూడా రషీద్ ఆడుతున్నాడు. తాజాగా రషీద్ ఖాన్ గురించి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 'ఈ మిస్టరీ స్పిన్నర్ క్రికెట్లో మరింత మెరుగ్గా రాణించాలంటే భారత మాజీ స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లేతో ఎల్లప్పుడూ టచ్లో ఉండాలి. అతని నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకోవాలి. రషీద్కు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు అతని వయస్సు 19 మాత్రమే. ప్రస్తుతం అతడు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు' అని గంగూలీ అన్నాడు.
ఇటీవల ఓ వెబ్ షోలో రషీద్ ఖాన్ మాట్లాడుతూ... 'అనిల్ కుంబ్లే నా అభిమాన ఆటగాడు. అతని బౌలింగ్ వీడియోలు చూస్తుంటాను' అని చెప్పాడు. కాగా, ఇటీవల అఫ్ఘనిస్తాన్.. భారత్తో ఆడిన చారిత్రాత్మక టెస్టులో అఫ్ఘినిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వన్డే, టీ 20 ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న రషీద్ ఖాన్పైనే ఆశలు పెట్టుకుని ఆ జట్టు బరిలోకి దిగింది.
అయితే ఐపీఎల్లో రషీద్ జట్టు సన్రైజర్స్ తరపునే ఆడిన శిఖర్ ధావన్ అఫ్ఘాన్ బౌలర్లను ఎదుర్కొని అసాధారణ స్కోరును చేయగలిగాడు. అతని కెరీర్లోనే అత్యుత్తమం ఇన్నింగ్స్ ఆడి 147 పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.