

హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ తండ్రి మరణ వార్త తెలిసి కూడా తన ఆటను కొనసాగించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్లో రషీద్ ఖాన్
అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా సోమవారం అడిలైడ్ స్ట్రైకర్స్-సిడ్నీ థండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ఆదివారం రషీద్ఖాన్ తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాదకరమైన వార్త తెలిసినా కూడా రషీద్ మాత్రం మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.
అంతేకాదు తండ్రి పోయిన బాధను దిగమింగుతూ.. మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక, తన తండ్రి చనిపోయిన విషయాన్ని రషిద్ ఖాన్ తన ట్విట్టర్లో "నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయా" అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తండ్రి మరణ వార్త తెలిసి కూడా రషీద్ మ్యాచ్ ఆడటానికి సిద్దపడ్డాడని అడిలైడ్ స్ట్రైకర్స్ పేర్కొంది.
కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున భారత అభిమానులకు రషీద్ ఖాన్ దగ్గరైన విషయం తెలిసిందే. ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టుతోపాటు ఆఫ్ఘనిస్థాన్కు కూడా ఎన్నో మరుపురాని విజయాలను సాధించిపెట్టాడు. రషీద్ తండ్రి మరణవార్తపై మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.