
హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా మే19న కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో కేకేఆర్ 5వికెట్ల తేడాతో టాప్ 1లో దూసుకుపోతున్న హైదరాబాద్ను ఓడించింది. మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ భావోద్వేగానికి గురి అయ్యాడు. అతని స్నేహితుడి మరణవార్త ఆలస్యంగా విన్న రషీద్ ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని వ్యక్తపరిచాడు.
అఫ్గనిస్తాన్లోని నాన్గరార్ ప్రాంతంలో టెర్రరిస్టుల దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 45మంది వరకూ గాయాలకు లోనైయ్యారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. రమజాన్ మాసం సందర్భంగా రాత్రి టోర్నమెంట్ నిర్వహిస్తోంది. ఆ ఈవెంట్ ను నిర్వహిస్తోన్న తన స్నేహితుడు హిదాయతుల్లా జహీర్ ప్రాణాలు కోల్పోయాడు.
ఏటా రమజాన్ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్ను నిర్వహించే ప్రాణ స్నేహితుడు కోల్పోవడంతో రషీద్ ఖాన్ విషాదానికి గురైయ్యాడు. 'మేము నిన్ను మిస్సవుతున్నాం. ప్రతి క్షణం నాన్గారర్ ప్రాంతాన్ని వెలుగొందేలా చేశావు. అమరుడవైన నీ ఆత్మకు అల్లాహ్ శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను.' అని పేర్కొన్నాడు.
ఈ ఘటనపై ఐసీసీ ముఖ్య కార్య నిర్వహణాధికారి డేవిడ్ రిచర్డ్సన్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. 'ఈ వార్త విన్న వెంటనే మేము చాలా విషాదానికి గురైయ్యాం. చనిపోయిన వారి కుటుంబాలకు క్రికెట్ అండగా నిలుస్తుంది.' అని పేర్కొన్నాడు.
అఫ్గనిస్థాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘని మాట్లాడుతూ 'జలాలాబాద్ మైదానంలో మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరో ఇంకా తెలియరాలేదు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణం. దాడులకు పాల్పడిన వారు మానవత్వానికి శత్రువులు' అని పేర్కొన్నారు.