హైదరాబాద్: కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో విదర్భ ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కర్ణాటకపై విదర్భ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో రంజీట్రోఫీ చరిత్రలో విదర్బ తొలిసారి ఫైనల్కు చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది.
నాలుగో రోజైన బుధవారం 198 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి కర్ణాటక 192 పరుగులకే ఆలౌటైంది. విదర్భ బౌలర్ రజ్నీష్ గుర్బాని (7/68)తో తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ గణంకాలను నమోదు చేశాడు.
తొలి ఇన్నింగ్స్లో విదర్భ 185 పరుగులు చేయగా... కరుణ్ నాయర్ (153) సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక 301 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో విదర్భ బ్యాట్స్మెన్లు సతీష్ 81, వాంఖడె 49, సర్వతె 55 రాణించడంతో 313 పరుగులు చేయగలిగింది.

దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యాన్ని కలుపుకుని రెండో ఇన్నింగ్స్లో కర్ణాటక విజయానికి 198 పరుగులు అవసరమయ్యాయి. 198 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన కర్ణాటక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.
కర్ణాటక టాపార్డర్ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ 30, సమర్థ్ 24, గౌతమ్ 24 తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ఐదోరోజైన గురువారం టెయిలెండర్లు మాత్రమే మిగిలి ఉండటంతో కర్ణాటక విజయానికి అవసరమైన 87 పరుగులు చేయడంలో విఫలం కావడంతో కర్ణాటకకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో గుర్బానీ మొత్తంగా 12 వికెట్లు సాధించాడు
ఇదిలా ఉంటే మరొక సెమీ ఫైనల్లో బెంగాల్పై ఢిల్లీ ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. డిసెంబర్ 29న జరగనున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ఢిల్లీతో తలపడనుంది. ఫైనల్స్కు ఇండోర్ ఆతిథ్యమిస్తోంది.
స్కోరు వివరాలు:
విదర్భ తొలి ఇన్నింగ్స్: 185 ఆలౌట్
కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 301 ఆలౌట్
విదర్భ రెండో ఇన్నింగ్స్: 313 ఆలౌట్
కర్ణాటక రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.