హైదరాబాద్: టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ రంగనా హెరాత్ నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది నవంబర్లో ఇంగ్లాండ్తో జరగబోయే సిరిస్ తన ఆఖరి సిరిస్ కావొచ్చని బుధవారం రంగనా హెరాత్ ప్రకటించాడు.
స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ తర్వాత శ్రీలంక తరుపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్గా రంగనా హెరాత్ ఉన్నాడు. టెస్టు క్రికెట్లో 400కుపైగా వికెట్లు తీసుకున్న రంగనా హెరాత్ శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లు సంగక్కర, జయవర్దనే రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఈ వెటరన్ స్పిన్నర్ కీలకంగా మారాడు.
గత రెండేళ్లుగా కేవలం టెస్టులకే పరిమినతమైన హెరాత్ నిలకడగా రాణిస్తూ ఆ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు. సీనియర్ ఆటగాడిగా జట్టులోని యువ ఆటగాళ్లకు స్పూర్తి నింపడంలో విజయవంతమయ్యాడు. 40 ఏళ్ల హెరాత్ స్వదేశంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లతో జరిగే టెస్టు సిరీస్ అనంతరం వీడ్కోలు పలకనున్నాడు.
దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ20 ఆడనుంది. ఆ తర్వాత స్వదేశంలోనే శ్రీలంక అక్టోబర్-నవంబర్ నెలలో ఇంగ్లాండ్తో ఐదు వన్డేలు, ఏకైక టీ20, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.
ఈ నేపథ్యంలో ఐసీసీ అధికారిక వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో హెరాత్ మాట్లాడుతూ "ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరిస్ చివరిది కావొచ్చు. దక్షిణాఫ్రికాతో సిరిస్ ముగిసిన తర్వాత మూడు నెలలు సమయం ఉంది. ప్రస్తుతం ఇదే నేను ప్లాన్ చేసుకున్నా" అని అన్నాడు.
శ్రీలంక తరుపున హెరాత్ 90 టెస్టుల్లో 418 వికెట్లు, 71వన్డేల్లో74 వికెట్లు, 17 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతివాటం బౌలర్గా హెరాత్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో పాక్ దిగ్గజ బౌలర్ వసీం ఆక్రమ్ (414) ఉన్నాడు. అంతేకాదు హెరాత్ శ్రీలంకకు ఐదు టెస్టులకు నాయకత్వం వహించగా మూడు టెస్టులు గెలవగా, రెండింట ఓటమిపాలైంది.