
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సైతం రెండేళ్ల నిషేదాన్ని పూర్తి చేసుకుని ఐపీఎల్లోకి అడుగుపెట్టబోతోంది. నిన్నమొన్నటి వరకు సొంత గడ్డపై ఆడే మ్యాచులను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎక్కడ వేదికగా ఆడుతుందా.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఆ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాజధాని ప్రాంతమైన జైపూర్లోనే సవాయ్ మన్సింగ్ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకుంది.
మార్చి 5 నాటికి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) మైదానాన్ని సిద్ధం చేయడంతోపాటు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అసోసియేషన్ అధ్యక్షుడు సీపీ జోషి, ఛైర్మన్ రంజీత్ ఆ పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా పనులన్నింటినీ క్లియర్ చేయడంతో రాజస్థాన్ క్రీడల మంత్రి ఆధ్వర్యంలో ఆర్సీఏ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది రాజస్థాన్ సొంతగడ్డపై ఏడు మ్యాచ్లను ఆడనుంది.
ఈ సందర్భంగా ఆర్సీఏ నిర్వాహకులు మాట్లాడుతూ..'ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు మరోసారి సవాయ్ మన్సింగ్ మైదానం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇక ఎలాంటి పెండింగ్ పనులు లేవు. జైపూర్ ప్రజలకు ఇదో కానుక. ఇక నుంచి రాష్ట్రంలో క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తాం'అని తెలిపారు.
ఈ సవాయ్ మన్సింగ్ స్టేడియం (ఎస్సెమ్మెస్) వేదికగా జరిగిన తొలి ఐపీఎల్లో విజేతగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఆ జట్టు అదే వేదికగా ఆడుతుండటంతో ఈ సీజన్ను కాస్త ఎమోషనల్గానే భావిస్తోంది. ఈ ఏర్పాట్లను జోషి, భరత్ ఠాకూర్ పరిశీలించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సరిపడే విధంగా ఈ క్రీడా మైదానాన్ని వారు తీర్చిదిద్దనున్నారు.