పిచ్ ఎవరికి అనుకూలం?
నేపియర్లోని ఎంక్లీన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిల్యాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్కు పూర్తిగా సహకరిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 171 పరుగులుగా ఉంది. అయితే పేసర్లకు కూడా పిచ్ నుంచి కొద్దో గొప్పో సహకారం అందే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ మ్యాచ్లో అయినా టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్, స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్లకు అవకాశం దక్కుతుందేమో చూడాలి. రెండో మ్యాచ్లో అదరగొట్టిన సూర్యకుమార్పైనే అందరి చూపూ ఉంది. ఈ మ్యాచ్లో అతను ఎలా రాణిస్తాడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండో ఇన్నింగ్స్పై డౌట్స్..
నేపియర్లో జరిగే ఈ మ్యాచ్ ఆరంభంలో వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదని వాతావరణ శాఖ చెప్తోంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7.30కు ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ జరిగే సమయంలో జల్లులు పడే అవకాశం కనిపిస్తోందట. మరి దీని వల్ల రెండో ఇన్నింగ్స్ పూర్తిగా సాగుతుందా? లేదా? చూడాలి. ఆకాశం కూడా 98 శాతం మబ్బులు పట్టే ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది.
ఆధిక్యంలో భారత్
మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. అయితే రెండో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అజేయ శతకంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. అనంతరం భారత బౌలర్లు కూడా ఆకట్టుకోవడంతో కివీస్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసింది. న్యూజిల్యాండ్ కెప్టెన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ప్రస్తుతానికి ఈ సిరీస్లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే మూడో మ్యాచ్కు కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. అతని స్థానంలో వెటరన్ పేసర్ టిమ్ సౌథీ ఆ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
సెమీస్ ఓటమి తర్వాత తొలి మ్యాచ్
ప్రపంచకప్లో అద్భుతంగా పోరాడి సెమీఫైనల్ చేరిన భారత్, న్యూజిల్యాండ్ జట్లు రెండూ.. నాకౌట్ మ్యాచులో పోరాటం చూపించలేక వెనుతిరిగాయి. పాకిస్తాన్ చేతిలో కేన్ విలియమ్సన్ టీం, ఇంగ్లండ్ చేతిలో రోహిత్ సేన ఘోరంగా ఓడిపోయాయి. ఈ ఓటమి బాధను పూర్తిగా మర్చిపోకముందే కివీస్ టూర్ ప్రారంభమైపోయింది. మరి ఈ టోర్నీలో పాండ్యా నాయకత్వంలోని జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.