ఐపీఎల్ మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పెద్ద తోపు ఆటగాడని, అతను ఉంటే జట్టుకు చాలా బలం ఉంటుందని ఆ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఒక కెప్టెన్, కీపర్, ఓపెనర్ మూడు పాత్రలకు రాహుల్ న్యాయం చేయగలడని కితాబిచ్చాడు. ఇప్పుడేమో.. టీమిండియాలో రాహుల్ చోటు దక్కించుకోవడం కష్టమని అంటున్నాడు. ఇటీవలి కాలంలో చాలా చెత్త ఫామ్లో ఉన్న రాహుల్ను టీ20 ఫార్మాట్కు ఇక ఎంపిక చేయకూడదని సెలెక్టర్లు అనుకుంటున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఆడింది ఒక్క మ్యాచే అయినా ఆ మ్యాచులో ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. ఇక మరో ఓపెనర్గా శుభ్మన్ గిల్ కూడా ఆకట్టుకుంటున్నాడు. వీళ్లిద్దరూ ఉండగా రాహుల్కు ఓపెనింగ్ చేసే అవకాశం దక్కడం కష్టమని గంభీర్ చెప్పాడు. ఒక వేళ రాహుల్, కోహ్లీ కనుక టీ20 జట్టుతో చేరితే.. రాహుల్ ఓపెనర్గా, కోహ్లీ మూడో స్థానంలో ఆడాల్సిందేనని అన్నాడు. కానీ ప్రస్తుతం కుర్రాళ్లు చెలరేగుతున్న నేపథ్యంలో రాహుల్కు ఆ అవకాశం దక్కడం కష్టమని చెప్పాడు.
టీ20 వరల్డ్ కప్లో కూడా చాలా డిఫెన్సివ్గా బ్యాటింగ్ చేసిన రాహుల్ విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతన్ని టీ20 ఫార్మాట్కు ఎంపిక చేయకూడదని సెలెక్టర్లు అనుకుంటున్నారట. వన్డేల్లో కూడా ఓపెనింగ్ చేయించకుండా మిడిలార్డర్ బ్యాటర్గానే రాహుల్ను చూస్తున్నారని తెలుస్తోంది.
టాపార్డర్లో ఇకపై ధవన్ను కూడా కాదని ఇషాన్ కిషన్కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఆ తర్వాత మరో ఓపెనర్గా గిల్ ఉండనే ఉన్నాడు. మూడు, నాలుగు స్థానాలను కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సుస్థిరం చేసుకున్నారు. ఇక ఐదో స్థానంలో రాహుల్ ఆడతాడు. అతను కనుక మళ్లీ ఫామ్ అందుకోకుంటే ఆ స్థానం కూడా పోయే ప్రమాదం ఉంది.