హైదరాబాద్: 2001లో ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ప్రతి ఒక్క భారత్ క్రికెట్ అభిమానికీ ఇప్పటికీ గుర్తే. ఆ టెస్టులో రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్లు నెలకొల్పిన 374 పరుగుల భాగస్వామ్యం టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ గొప్ప ఇన్నింగ్స్గా నిలిచింది.
తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. అనతంరం బ్యాటింగ్కు దిగిన భారత్ కేవలం 171 రన్స్కే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. దీంతో మ్యాచ్ పోయినట్లేనని అంతా నిరుత్సాహాంలో ఉన్నారు. కానీ, లక్ష్మణ్, ద్రావిడ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్... ఆ తర్వాత బంతితో హర్భజన్ సింగ్ చేసిన మ్యాజిక్ భారత్కు విజయాన్ని కట్టబెట్టింది.
ఈ మ్యాచ్లో ద్రావిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటగాళ్లంతా పెవిలియన్ కు క్యూ కట్టిన క్రమంలో రాహుల్ ద్రవిడ్ క్రీజులోకి వచ్చాడు. ఈ పర్యటనకు ముందు రాహుల్ ద్రవిడ్ ఫామ్పై తీవ్ర చర్చ జరుగుతోంది. అంతకముందు జరిగిన మ్యాచ్ల్లో ద్రవిడ్ దారుణమైన ప్రదర్శనను కనబర్చాడు.
దీంతో కోల్ కతా టెస్టులో ద్రవిడ్ను ఆరోస్థానంలో బరిలోకి పంపారు. అప్పుడు ఆసీస్ కెప్టెన్గా ఉన్న స్టీవ్ వా స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు. ఏం ద్రవిడ్.. ఈ ఇన్నింగ్స్లో ఆరో స్థానం.. తర్వాత ఏంటి? 12వ స్థానమా? అంటూ అవహేళనగా మాట్లాడాడు. కానీ, ద్రవిడ్ మాత్రం అవేం పట్టనట్లు క్రీజులోకి వచ్చాడు.
లక్ష్మణ్తో కలిసి ద్రవిడ్ ఆడిన ఇన్నింగ్స్ ఆట స్వరూపమే మార్చివేసింది. ఆసీస్ బౌలర్లు ఎంతమంది మారినా ఈ జోడీని విడదీయలేకపోయారు. ముఖ్యంగా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ను ఇద్దరూ ఓ ఆటాడుకున్నారు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా 376 పరుగుల భాగస్వామ్యంతో భారత్ 657 పరుగులు చేసింది.
ఆ త్రవాత భజ్జీ విజృంభించడంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆలౌట్ కావడంతో 171 పరుగుల చరిత్రాత్మక విజయం సాధించింది. తాజాగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 'ఆ సమయంలో నా ఫామ్ నిజంగా బాగోలేదు. మైదానంలోకి వెళ్లేముందు వా మాటలు నా చెవిని తాకాయి. కానీ, నా దృష్టిని మరలించలేకపోయాయి. అప్పుడు నేను ఆలోచించింది ఒక్కటే' అని అన్నాడు.
'గతం, భవిష్యత్ రెండూ ఇప్పుడు నా చేతుల్లో లేవు. ప్రస్తుతం నా ముందు ఉన్నది ఒక్కటే. వీలైనన్నీ బంతిని ఎదుర్కోవటం... పరుగులు సాధించటం. ఈ క్రమంలో లక్ష్మణ్ తో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నా. జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చూడాలి తప్ప.. వెనకడుగు వేసేందుకు యత్నించకూడదు' అని ద్రవిడ్ అన్నాడు.
అంతేకాదు తన కెరీర్లో విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. 'వైఫల్యం గురించి మాట్లాడ్డానికి నేను అర్హుణ్ని. ఓ టీ20 సహా భారత్ తరఫున 604 మ్యాచ్లు ఆడాను. 410 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ దాటలేదు. దీనిని బట్టి, నా కెరీర్లో విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువ' అని అన్నాడు. వైఫల్యం మనల్ని మనం అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుందని, క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తుందని ద్రవిడ్ చెప్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.