
బెంగళూరు: ఇద్దరు భారత క్రికెట్ దిగ్గజాలు కలిస్తే అద్భుతంగా ఉంటుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ట్వీట్ చేసింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ధర్మశాల వేదికగా జరగాల్సిన మొదటి టీ20 వర్ష కారణంగా రద్దు కాగా.. మొహాలీలో బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
చివరిదైన మూడో టీ20 ఈ నెల 22న (ఆదివారం) బెంగళూరులో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో గురువారం బెంగళూరుకు చేరుకున్నారు. ఇక శుక్రవారం చిన్నస్వామి మైదానంలో కోహ్లీ సేన ప్రాక్టీస్ చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బాధ్యతలు నిర్వహిస్తున్న 'టీమిండియా వాల్' మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ సేనను కలిసాడు. అక్కడి ఆటగాళ్లతో ద్రవిడ్ మాట్లాడాడు.
ఇక టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని మైదానంలో ద్రవిడ్ కలిసాడు. ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు దిగ్గజాలు తమ ఆలోచనలను పంచుకున్నారు. దీనికి సంబందించిన ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఇద్దరు భారత క్రికెట్ దిగ్గజాలు కలిసిన వేళ' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ద్రవిడ్ శిక్షణలోనే భారత్-ఏ తరపున యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, సంజు సాంసన్, రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, నవదీప్ సైనీ వంటి ఎంతోమంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఇటీవల భారత్ ఆడే సిరీస్లో వీరందరూ ఎంపికవ్వడం విశేషం. మరింతమంది యువ ఆటగాళ్లపై ద్రవిడ్ దృష్టి పెట్టాడు.