
హైదరాబాద్: దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్లో రాణించిన యజువేంద్ర చాహాల్, మహ్మద్ సిరాజ్లపై భారత్-ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ద్రవిడ్ మాట్లాడుతూ చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహాల్ రెడ్ బాల్ క్రికెట్ ఎక్కువ ఆడితే టెస్టు ఫార్మాట్లో అనుభవం వస్తుందని అన్నాడు.
దక్షిణాఫ్రికా-ఏతో అనధికార మ్యాచ్ ముగిసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ "చాహల్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టారు. అతడు సుదీర్ఘ క్రికెట్ ఆడకపోవడంతో ఎరుపు బంతితో ఎలా రాణిస్తాడో చూడాలనుకున్నారు. అందుకే మేం అతడికి కొన్ని అవకాశాలు ఇచ్చాం. ఇది బాగా పనిచేసింది" అని అన్నాడు.
"చాహల్ ఎక్కువగా ఎరుపు బంతితో క్రికెట్ ఆడితే మరింత అనుభవం వస్తుంది. అతడికి చాలా నైపుణ్యాలు ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కావాల్సిందల్లా ఎక్కువ మ్యాచ్లు ఆడటమే" అని ద్రవిడ్ పేర్కొన్నాడు. గతంలో భారత్-ఏ తరఫున ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వన్డే సిరిస్లో చక్కటి ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రదర్శనను ద్రవిడ్ కొనియాడాడు. దక్షిణాఫ్రికా-ఏతో అనధికార మ్యాచ్లో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి సిరాజ్ 10 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. "ఇంగ్లాండ్లో గత మూడు నాలుగు మ్యాచుల్లో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. దాదాపు 26 వికెట్లు తీశాడు" అని అన్నాడు.
"సిరాజ్ మానసికంగా, శారీరకంగానూ దృఢంగా మారుతున్నాడు. అండర్-17, అండర్-19లో అతడికి తగినంత అనుభవం లేకపోయినప్పటికీ బాగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 17 నుంచి 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లే ఆడాడు. కొన్ని ఐపీఎల్ మ్యాచ్లాడిన అనుభవం ఉంది. అతను ఎంత ఎక్కువగా క్రికెట్ ఆడితే అన్ని ఎక్కువ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు" అని ద్రవిడ్ తెలిపాడు.