వాషింగ్టన్: క్రికెట్ ఆటలో సింగిల్స్ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రెండు, మూడు బంతులకో సిక్సర్ బాదే పరిస్థితులు వచ్చేశాయని అభిప్రాయపడ్డారు. క్రికెట్లో ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలో డేటా ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఆటలో పోటీని పెంచేందుకు ఇది ఊతమిస్తోందని వెల్లడించారు. ఎంఐటీ స్లోన్ స్పోర్ట్స్ అనలిటిక్స్ కాన్ఫరెన్స్లో ప్యానెల్ చర్చలో పాల్గొన్న ద్రవిడ్ పైవిధంగా పేర్కొన్నారు.
ఎంఐటీ క్రీడా విశ్లేషణ సదస్సులో రాహుల్ ద్రవిడ్ సహా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్.. ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి ఇషా గుహ సదస్సులో పాల్గొన్నారు. ఆటగాళ్లు సాధన చేసేందుకు.. ఫిట్గా ఉండేందుకు.. బౌండరీలు, సిక్సర్లు బాదేందుకు ఇంకా మరెన్నో అంశాల్లో డేటా ఎలా ఉపయోగపడుతుందో అని వీరు చర్చించారు. బాస్కెట్ బాల్లోని 3 పాయింట్ రెవల్యూషన తరహాలోనే క్రికెట్లో డేటా ప్రయోజనాలు ఉంటాయని ముగ్గురూ స్పష్టం చేశారు.
'క్రికెట్ ఆటలో సింగిల్స్ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవు. ఎందుకంటే ప్రతి రెండు, మూడు బంతులకో సిక్సర్ బాదే పరిస్థితులు వచ్చేశాయి. క్రికెట్లో బ్యాటు, బంతికి నడుమ పోటీని డేటా నడిపించనుంది' అని రాహుల్ ద్రవిడ్ అన్నారు. 'టీ20ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యం ఏర్పడింది. కొత్త కుర్రాళ్లు మెరుగైన సాంకేతికత కారణంగా ప్రత్యర్థి ఆటగాళ్ల బలాబలాలను విశ్లేషించుకొని ప్రతిదాడి చేస్తున్నారు. మ్యాచ్కు సన్నద్ధమయ్యేందుకు జట్లు డేటా ఆధారంగా ప్రయోజనం పొందుతున్నారు' అని ఇషా గుహ తెలిపారు.
క్రీడల్లో సందిగ్ధం నెలకొనప్పుడు డేటా ఎలా ఉపయోగపడుతోందో అని గ్యారీ కిర్స్టెన్ వివరించారు. ఎంఐటీ సమావేశంలో క్రికెట్పై మొట్టమొదటి ప్యానెల్ చర్చ ఇదే కావడం విశేషం. డేటా అనలిటిక్స్ మరియు మెషీన్ లెర్నింగ్ ఆటకు పురోగతిని తీసుకురావడానికి ఎలా సహాయపడుతున్నాయనే దానిపై గురువారం జరిగిన ఎంఐటీ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. డెల్ టెక్నాలజీస్ డైరెక్టర్ అలోక్ సింగ్ ఏర్పాటు చేసిన ప్యానెల్ చర్చలో క్రికెట్ దిగ్గజాలు భాగమయ్యారు.
ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ఏదో తెలుసా?.. సన్రైజర్స్ది ఎనిమిదో స్థానం!!