అత్యంత చెత్త బౌలింగ్..
ఇలాంటి సమయంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. తన బౌలర్లకు అండగా నిలిచాడు. వీళ్లంతా ఇంకా కుర్రవాళ్లేనని, అంతర్జాతీయ స్థాయిలో తొలి అడుగులు వేస్తున్నారని, ఇప్పుడే వారికి అండగా నిలబడాలని అభిప్రాయపడ్డాడు. గాయం కారణంగా వాంఖడేలో జరిగిన తొలి టీ20కి దూరమైన అర్షదీప్.. ఈ మ్యాచ్లో కేవలం రెండు ఓవర్లే వేశాడు. వీటిలో హ్యాట్రిక్ నోబాల్స్ కూడా నమోదు చేశాడు. క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఆడుతూ ఒక భారత బౌలర్ వేసిన అత్యంత చెత్త స్పెల్గా అర్షదీప్ బౌలింగ్ నిలిచింది. అయినా అతన్ని విమర్శించొద్దని ద్రావిడ్ అడిగాడు.
నేర్చుకోవడంలో భాగమే..
ఇలాంటి ప్రదర్శనలన్నీ కూడా నేర్చుకోవడంలో భాగమేనని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. ఈ యువ ఆటగాళ్లు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నారు కాబట్టి, ప్రేక్షకులు కూడా కొంత సహనం ప్రదర్శించాలని కోరాడు. 'నోబాల్స్, వైడ్స్ వేయాలని ఎవరూ అనుకోరు. అదీ టీ20ల్లో అయితే ఆ ఆలోచన కూడా రాదు. ఎందుకంటే అవి జట్టును దెబ్బతీస్తాయి. అందుకే ఈ కుర్రాళ్ల విషయంలో కొంత సహనం చూపాలి. వీళ్లంతా కుర్రాళ్లే. నేర్చుకునే క్రమంలో ఇలాంటి మ్యాచులు కూడా వస్తాయి. వాళ్లు కూడా కష్టపడుతున్నారు. వాళ్లకు మద్దతుగా నిలుస్తూ, సాంకేతికంగా సాయం చేస్తూ, వాళ్ల చుట్టూ మంచి వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం' అని చెప్పాడు.
కుర్రాళ్లకు మంచి అవకాశం..
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఉన్న నేపథ్యంలో టీ20లపై బీసీసీఐ కొంత ఫోకస్ తగ్గించింది. సీనియర్లకు ఈ ఫార్మాట్లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే ఈ టీ20 సిరీస్కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ వంటి వారిని ఎంపిక చేయలేదు. దీంతో కొత్త కుర్రాళ్లకు ఇది మంచి సదవకాశం అని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. 'అంతర్జాతీయ క్రికెట్లో నేర్చుకునే అవకాశం దొరకడం చాలా కష్టం. అయితే వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ వల్ల లాంగెస్ట్ ఫార్మాట్లపై ఫోకస్ పెరగడంతో.. కనీసం టీ20ల్లో అయినా కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ దొరుకుతుంది' అని ద్రావిడ్ అన్నాడు.