హైదరాబాద్: స్వదేశంలో శ్రీలంక పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టులో అజ్యింకె రహానే కూడా సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఇటీవల రహానే ఫామ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో రహానె ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రహానే ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. రహానే ఫామ్ గురించి దాదా సోమవారం మీడియాతో మాట్లాడాడు.
'రహానె ఫామ్ గురించి ఆందోళన అనవసరం. అతను నాణ్యమైన బ్యాట్స్మన్. కోహ్లీ, రహానె, పుజారా, విజయ్.. వీళ్లందరూ ఇంతకుముందే దక్షిణాఫ్రికాలో పర్యటించారు. ఇప్పుడు మరింత మెరుగైన ఆటగాళ్లుగా ఆ దేశంలో పర్యటించబోతున్నారు' అని గంగూలీ అన్నాడు.
ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలింగ్ మెరుగ్గా ఉందని, అయితే వీరంతా దక్షిణాఫ్రికాలో ఎలా రాణిస్తారన్నది వేచి చూడాలని గంగూలీ చెప్పుకొచ్చాడు. టీమిండియా యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు కల్పించి, ఆరో స్థానంలో ఆడిస్తే మంచిదని గంగూలీ ఈ సందర్భంగా అన్నాడు.
దక్షిణాఫ్రికాలో ఆయా మ్యాచ్లకు పిచ్ను బట్టి అదనపు ఫాస్ట్బౌలర్ను ఆడించాలా? లేదా బ్యాట్స్మన్ను ఎంచుకోవాలా? అన్నది మ్యాచ్ జరగడానికి ముందు నిర్ణయం తీసుకుంటే మంచిదని గంగూలీ మేనేజ్మెంట్కు సూచించాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జనవరి 5న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.