
హైదరాబాద్: జులై నెలలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై ఇప్పటినుంచే విశ్లేషణ మొదలైంది. దక్షిణాఫ్రికాలో భారత అద్భుత బౌలింగ్ దాడి ఇంగ్లాండ్లో ఐదు టెస్టుల సిరీస్ గెలిచేందుకు ప్రేరణనిస్తుందని టీమిండియా బ్యాట్స్మన్ అజింక్య రహానె అన్నాడు.
టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. '20 వికెట్లు తీయగల బౌలింగ్ ఎటాక్ ఇప్పుడు భారత్కు ఉంది. బ్యాట్స్మెన్ 400 పరుగులు చేస్తే చాలు మ్యాచ్లు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. జొహనెస్బర్గ్ పిచ్ అతిగానే స్పందించింది' అని వివరించాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'మన బౌలర్లు బాగా రాణించారు. భువి, బుమ్రా, షమి, ఇషాంత్ మనకు ఉన్నారు. నేను సారథిగా ఉన్నప్పుడు కుంబ్లే ఓ మాట అనేవాడు. మీరు 450 పరుగులు చేస్తే నేను జట్టుకు విజయాలు అందిస్తా అనేవాడు. కోహ్లీ, రహానె లాంటి స్టార్ బ్యాట్స్మెన్ మనకు ఉన్నారు' అని గంగూలీ పేర్కొన్నాడు.
'దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో రాణించే బౌలింగ్ వనరులు జట్టులో ఉన్నాయని మేమంతా విశ్వసిస్తున్నాం. అయితే శుభారంభాలు చాలా కీలకం. విదేశాల్లో పర్యటించేటప్పుడు వ్యక్తిగతంగానూ జట్టు పరంగానూ సవాళ్లు ఉంటాయి. మేమంతా చర్చించి వాటిని అధిగమిస్తాం. ఊపు కొనసాగించాలంటే సరైన సన్నద్ధత ఎంతైనా అవసరం' అని రహానె పేర్కొన్నాడు.
'దక్షిణాఫ్రికాలో 60 వికెట్లు పడగొట్టడం అంటే నమ్మశక్యం కాని విషయం. మా పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. దక్షిణాఫ్రికాలో చివరి టెస్టు జరిగిన జొహానెస్ పిచ్ చాలా ప్రమాదకరంగా ఉంది. అయితే ఒక వ్యక్తి హీరోగా మారేందుకు అదే అవకాశం ఇస్తుంది. తొలి రెండు మ్యాచ్ల్లో అవకాశాలు రాకపోవడంతో చివరి మ్యాచ్లో కసితో ఆడా' అని రహానె తెలిపాడు.