
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ క్రికెట్ కార్యకలాపాలు పునః ప్రారంభమయ్యాయి. ఆటగాళ్ల సాధన మొదలెట్టేందుకు క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ)కు ఆ దేశ క్రీడామంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. దీంతో సీనియర్ బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్ నేతృత్వంలో పురుషుల జాతీయ జట్టులోని 44 మంది ఆటగాళ్లు శిక్షణ కోసం మైదానంలోకి అడుగుపెట్టారు. ఆటగాళ్లంతా తమకు దగ్గర్లోని ఫ్రాంఛైజీ టీమ్ల కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ పొందనున్నారు.
ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్లు సీఎస్ఏ కరోనా వైరస్ స్టీరింగ్ కమిటీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. మరోవైపు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ డిసీజెస్ కూడా ఆటగాళ్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 'ప్రోటోకాల్స్ మరియు కొన్ని విషయాలలో మరిన్ని వివరాల కోసం ఎన్ఐసీడితో సమావేశం అయ్యాం. వారు చెప్పిన మార్గదర్శకాలను ఆటగాళ్ళు మరియు సహాయక సిబ్బంది తప్పకుండా పాటిస్తారు. అందరిని నిత్యం పరీక్షించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత చర్యలపై అవగాహన కల్పిస్తాం' అని సీఎస్ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ షుయబ్ మంజ్రా చెప్పారు.
దక్షిణాఫ్రికాలో 1,38,000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 2,400 మంది మరణించారు. ఇక గత మార్చి 15 నుంచి దక్షిణాఫ్రికాలో క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మూడు నెలల క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. అదే సమయంలో భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో సఫారీ జట్టు తిరిగి స్వదేశం వెళ్లిపోయింది.
కరోనా కారణంగా నిలిచిపోయిన క్రికెట్ మూడు నెలల విరామం అనంతరం మళ్లీ మొదలవబోతున్నది. స్వదేశంలో వెస్టిండీస్తో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్ధంగా ఉంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు సౌతాంప్టన్ వేదికగా జూలై 8న ప్రారంభం కానుంది. యో సెక్యూర్ వాతావరణంలో టెస్టు సిరీస్ను నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ కోసం ఇప్పటికే వెస్టిండీస్ జట్టు సెల్ఫ్ ఐసోలేషన్ కూడా పూర్తిచేసుకుంది. తొలి టెస్టుకు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ దూరం కానున్నాడు. తన భార్య ప్రసవించే అవకాశం ఉండటంతో రూట్ జట్టును వీడనున్నాడు. రూట్ స్థానంలో సీనియర్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి తాత్కాలికంగా జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.