
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జైలు శిక్షపై క్రికెటర్లు సైతం స్పందిస్తున్నారు. పాకిస్తాన్తో దగ్గరి సంబంధాలున్న నేపథ్యంలో రావల్పిండి ఎక్స్ప్రెస్ పాకిస్తాన్ మాజీ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ తన స్నేహితుడి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్కు కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడటం పట్ల విచారకరం అన్నారు.
స్నేహితుడికి ఐదేళ్ల శిక్ష విధించడం పట్ల బాధను వ్యక్తం చేసిన ఆయన ఇది చాలా కఠినమన్నారు. భారత రాజ్యాంగాన్ని, కోర్టు నియమాలను అనుసరించాల్సిందే కాబట్టి.. అతను జైలుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయం పట్ల అతనికి, అతని కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
త్వరలోనే సల్మాన్ తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 1998వ సంవత్సరం కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ 2018 ఏప్రిల్ 5న పూర్తి అయింది. ఇందులో సల్మాన్ ను దోషిగా తేల్చిన జోథ్పూర్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. దాంతో పాటుగా రూ.10 వేల జరిమానా విధించారు.
ప్రీతి జింతా:
సహ నటుడు, స్నేహితుడు అయిన సల్మాన్ ఖాన్ను కలిసేందుకు ప్రీతి జింతా జైలుకెళ్లారు. కోర్టు నిర్ణయం తర్వాత శిక్ష ఖరారైన సల్మాన్ను పోలీసులు జోథ్పూర్ జైలుకు తరలించారు. దీంతో ఆమె అక్కడికే వెళ్లి సల్మాన్ను పరామర్శించారు.