హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటోల తొలగింపు జాబితాలోకి తాజాగా మరో స్టేడియం చేరింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, మొహాలీలోని పీసీఏ స్టేడియం, జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఇమ్రాన్ ఖాన్ పోటోలను తొలగించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 షెడ్యూల్ విడుదల: ఫస్ట్ మ్యాచ్ ధోనీ Vs కోహ్లీ
తాజాగా మంగళవారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను తొలగిస్తూ స్టేడియం నిర్వాహాకులు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు.
ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. దీనికి దాయాది దేశం పాకిస్థానే కారణమంటూ ప్రజలంతా ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే పాక్ క్రికెటర్ల ఫోటోలను వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు తీసేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు పుల్వామా ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ "భారత్ మా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదు, ఆలోచించకుండా తిరిగి దాడి చేస్తాం. టెర్రరిజం పెంచి పోషించడం, లేదా వేరే దేశం మీద కు పంపించడం మాకు కూడా శ్రేయస్కరం కాదు" అని చెప్పుకొచ్చాడు.
పాక్ ప్రభుత్వం గానీ, ఆర్మీ గానీ ఉగ్రవాదులకు మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. పాకిస్థాన్ కూడా ఉగ్రదాడులతో సతమతమవుతోందన్న సంగతి ప్రపంచం గుర్తించాలని అన్నారు. భారత్ తమపై ఆరోపణలు చేయడం మాని ఉగ్రదాడిపై ఆధారాలు చూపితే ఏమైనా చర్యలు తీసుకోగలమని ఆయన స్పష్టం చేశారు.
అలా కాదని తమపై దాడికి దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉందని హెచ్చరికలు జారీ చేశారు.