హైదరాబాద్: టెస్టు క్రికెట్లో మూడు, నాలుగు స్థానాలు ఎంతో కీలకమైనవని, అలాంటి స్థానాలపై ప్రయోగాలు అంత మంచిది కాదని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం గుండప్ప విశ్వనాథ్ అన్నారు. బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో పుజారాకు బదులు కేఎల్ రాహుల్ను ఫస్ట్ డౌన్లో పంపడాన్ని గుండప్ప తప్పబట్టాడు. టెస్టుల్లో మూడు, నాలుగు బ్యాటింగ్ స్థానాలు ఎంతో కీలకమైనవని, వాటిపై ఎప్పుడూ ప్రయోగాలు చేయకూడదని సూచించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాలు ఎంతో కీలకమైనవని పేర్కొన్న ఆయన, వాటిపై ప్రయోగాలు తగదు" అని అన్నాడు.
"టెస్టుల్లో మూడో నంబరు బ్యాట్స్మన్గా అద్భుతంగా రాణిస్తున్న పుజారాపై ఇలాంటి ప్రయోగాలు చేయడం సరికాదు. జులై నెలలో కీలక ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఇది అంత మంచిది కాదు" అని గుండప్ప విశ్వనాథ్ అన్నాడు. ఇక, కేఎల్ రాహుల్పై గుండప్ప విశ్వనాథ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
టెస్టుల్లో పరుగులు చేసేందుకు గాను ఇబ్బంది పడుతోన్న రహానే తప్పుకొని రాహుల్కి అవకాశం ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. కేఎల్ రాహుల్ ఆటలో ఎంతో పరిణితి చెందాడని, అతనికి వరసగా అవకాశాలు కల్పిస్తే ఇంకాస్త మెరుగ్గా రాణిస్తాడని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు.
ఆప్ఘన్ టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా దానిని సెంచరీగా మలచడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక టెస్టులో టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్లు సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే.