సచిన్ సర్ అప్పటి నుంచే మెంటార్:
'మొదటిసారి సచిన్ సర్ను కలిసినప్పుడు నాకు 8 ఏళ్లు. అప్పటి నుంచే ఆయనను మెంటార్గా భావిస్తున్నా. సర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. మైదానంలో ఎలా మెలగాలి, బయట క్రమశిక్షణతో ఎలా ఉండాలనే విషయాలు నేర్చుకున్నా. సర్ ఎంత బిజీగా ఉన్నా.. ఇప్పటికీ నేను సాధన చేసే చోట అతనుంటే కచ్చితంగా కొంత సమయం నాకోసం వెచ్చిస్తారు. అప్పుడు టెక్నికల్ అంశాల కన్నా మానసిక విషయాలపైనే ఎక్కువ చర్చిస్తాం. అందుకే మార్గనిర్దేశకత్వంలో కొనసాగడం అద్భుతంగా ఉంటుంది' అని పృథ్వీ షా తెలిపాడు.
చాలా ఏళ్లుగా పృథ్వీతో పరిచయం ఉంది:
సచిన్ టెండూల్కర్ సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పృథ్వీ షాపై ప్రశంసలు కురిపించారు. తనకు చాలా ఏళ్లుగా పృథ్వీతో పరిచయం ఉందని, అది నిజమేనని చెప్పారు. యువ క్రికెటర్ మంచి నైపుణ్యమున్న ఆటగాడని, అతడికి సహాయం చేయడానికి చాలా సంతోషిస్తా అని సచిన్ అన్నాడు. పృథ్వీతో క్రికెట్ విషయాలతో పాటు జీవితం గురించి కూడా చర్చిస్తానని స్పష్టం చేశారు. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడారు.
2018లో టెస్టు అరంగేట్రం:
యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా 2018 అక్టోబర్లో వెస్టిండీస్తో టెస్టు అరంగేట్రం చేసి.. ఆ మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా భారత్ తరఫున తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో గాయం బారిన పడిన పృథ్వీ .. ఆపై డోపింగ్ వివాదంలో పట్టుబడి ఎనమిది నెలలు ఆటకు దూరమయ్యాడు. నిషేధం అనంతరం గత ఫిబ్రవరి నెలలో జరిగిన న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా అక్కడ విఫలమయ్యాడు.
నా ఫేవరేట్ ఓపెనింగ్ భాగస్వామి ధావన్:
తన ఫేవరేట్ ఓపెనింగ్ భాగస్వామి శిఖర్ ధావన్ అని పృథ్వీ షా తాజాగా తెలిపాడు. ఎక్కువ సార్లు అతనితోనే ఓపెనింగ్ చేశానని, అందుకే అతనే తన ఫేవరేట్ పార్టనర్ అని ఈ ముంబై క్రికెటర్ చెప్పుకొచ్చాడు. తనను సచిన్తో పోలిస్తే ఒత్తిడికి గురవుతుంటానని, అయితే అది ఛాలెంజ్గా అనిపిస్తుంటుందని పృథ్వీ తెలిపాడు. సచిన్ క్రికెట్ దేవుడు అని కొనియాడాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు మెంటార్గా వ్యవహరించిన గంగూలీ గురించి స్పందిస్తూ.. దాదా ఎంతో సాయం చేశాడని, జట్టులో యువకులను ఎంతో ప్రోత్సహించాడని తెలిపాడు.