హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ సెంచరీలతో చెలరేగారు. దీంతో లిస్ట్-ఎ మ్యాచ్ల్లో రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. మూడు దేశాల ఎ-సిరీస్లో భాగంగా లీసెస్టర్షైర్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఇండియా-ఎ 281 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్ (151), పృథ్వీషా (132) సెంచరీలతో చెలరేగడంతో భారత్-ఎ 50 ఓవర్లలో 458/4 స్కోరు చేసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 26 ఓవర్లలోనే 221 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్ (54 బంతుల్లో 86; 7 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
దీంతో ఇండియా-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 458 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో లీసెస్టర్షైర్ 40.4 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలడంతో ఇండియా-ఎ 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ వెల్స్ (62) అర్ధసెంచరీ సాధించాడు.
భారత్ బౌలర్లలో దీపక్ చహర్ మూడు వికెట్లు తీయగా, ప్రసిద్ కృష్ణ, హుడా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీశారు. మంగళవారం లీసెస్టర్షైర్పై చేసిన 458/4 స్కోరుతో ఈ జాబితాలో మూడో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. 2007లో గ్లూసెస్టర్షైర్పై సర్రే చేసిన 494/4 స్కోరు అగ్రస్థానంలో ఉంది.