రెండు టెస్టుల్లో కలిపి 237 పరుగులు చేసిన పృథ్వీ షా
సీనియర్ ఆటగాళ్లు బంతులను అడ్డుకోవడానికే కష్టపడుతున్న తొలి ఇన్నింగ్స్లో పృథ్వీ షా ధైర్యంగా బౌండరీలు బాదాడు. రెండు టెస్టుల్లో కలిపి 237 పరుగులు సాధించాడు. దీంతో అరంగేట్రం సిరీస్లోనే టాప్ స్కోరర్గా నిలిచిన పృథ్వీ షాకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు సైతం దక్కించుకున్నాడు.
సంతోషంగా ఉందన్న పృథ్వీ షా
విండీస్పై టెస్టు సిరిస్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ "చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్లో విన్నింగ్ షాట్ బాదడం ప్రత్యేకం. ఇది నా తొలి టెస్టు సిరీస్. టీమిండియా 2-0తో గెలవడం, నేను మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికవ్వడం చాలా చాలా ప్రత్యేకం. జట్టులో అందరూ కుటుంబ సభ్యుల్లా ఉంటారు. జూనియర్, సీనియర్ అన్న తేడా లేదు. ఈ ప్రయాణం గొప్పగా ఉంది" అని చెప్పాడు.
ప్రస్తుతానికి ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా
"ఇలాగే ముందుకు పోవాలనుకుంటున్నా. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికి ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా" అని పృథ్వీ షా చెప్పాడు. ఆ తర్వాతి పెద్ద లక్ష్యం ఏమిటన్న ప్రశ్నకు పృథ్వీషా జవాబిచ్చాడు. "ఇదే ఊపు కొనసాగించాలని ఆశిస్తున్నా. వరల్డ్కప్తో పాటు అన్ని మ్యాచుల్లోనూ భారత్ను గెలిపించాలని కోరుకుంటున్నా" అని షా తన మనసులో మాట బయటపెట్టాడు.
2019 వరల్డ్ కప్ జట్టులో షా చోటు దక్కించుకోవాలంటే
ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్లో ఘోరంగా విఫలమైన మురళీ విజయ్, శిఖర్ ధావన్లపై వేటు వేసిన సెలక్టర్లు.. వెస్టిండీస్తో సిరీస్లో 18 ఏళ్ల పృథ్వీ షాకి అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే జట్టుకి టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కొనసాగుతున్నారు. 2019 వరల్డ్ కప్ జట్టులో షా చోటు దక్కించుకోవాలంటే నవంబరులో జరిగే ఆసీస్ సిరిస్లో తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.