హైదరాబాద్: మునుపటి ఫామ్ను అందుకోవడానికి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్పై దృష్టిసారించానని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు. సరిగ్గా మూడు నెలలు క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పృథ్వీ షా సిరిస్ ఆరంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో చీలమండ గాయం కావడంతో పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.
దిండా ఎఫెక్ట్: బౌలర్లూ ఫేస్మాస్క్లు ధరించాలంటోన్న ఉనాద్కత్, అశ్విన్
ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్కు ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్గా పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు. అయితే, వార్మప్ మ్యాచ్లో గాయం కావడం... ఆ తర్వాత గాయం నుంచి కోలుకుంటాడని రెండు టెస్టు మ్యాచ్ల వరకు అతడు అక్కడే ఉన్నాడు. అయితే, గాయం ఎంతకీ తగ్గక పోవడంతో అతడిని రెండు టెస్టు అనంతరం జట్టు మేనేజ్మెంట్ స్వదేశానికి తిరిగి పంపించింది.
ఇలా, సుమారు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న షా ప్రస్తుతం నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ముంబై తరఫున బరిలో దిగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ సందర్భంగా నెట్ ప్రాక్టీస్కు హాజరైన పృథ్వీ షా మాట్లాడుతూ "బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాతో ఆడేందుకు మంచి అవకాశం వచ్చింది. అయితే దానిని సద్వినియోగం చేసుకోకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాను" అని అన్నాడు.
"ఆసీస్ పర్యటనకు దూరం కావడం నన్ను ఎంతో బాధించింది. కొన్ని అంశాలు మన చేతుల్లో ఉండవు. మళ్లీ మునుపటి ఫామ్ను అందుకోవడానికి ఇప్పుడు ముస్తాక్ అలీ టోర్నమెంట్పై దృష్టిసారించాను'' అని పృత్వీ షా పేర్కొన్నాడు. గతేడాది నవంబర్లో ఆసీస్ ఎలెవన్ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో క్యాచ్ అందుకునే క్రమంలో షా గాయపడ్డాడు.
వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండో టెస్టు వరకు కోలుకుంటాడని జట్టు మేనేజ్మెంట్ భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో అతడు ఆస్ట్రేలియా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ చక్కటి ప్రదర్శన కనబర్చి ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు.