ఎంఐజీ క్రికెట్ అకాడమీలో రాటుదేలిన పృథ్వీషా
కానీ కొన్ని రోజులకే అతను మామూలోడు కాదని అర్థమైంది. అకాడమీ ప్రధాన కోచ్ ఆ కుర్రాడిని సీనియర్లు ఆడే నెట్స్కు పంపమని ఆదేశించాడు. అప్పట్నుంచి ఆ చిన్నోడు 18-20 ఏళ్ల వయసున్న కుర్రాళ్లతో కలిసే సాధన చేశాడు. ఈ క్రమంలో పృథ్వీషా చాలా వేగంగా రాటుదేలాడు. పృథ్వీ షా తన చిన్నతనంలో తన డైలీ నెట్ ప్రాక్టీస్ కోసం రెండు గంటల పాటు ప్రయాణం చేసేవాడు.
రోజు రెండు గంటలు ప్రయాణం చేసేవాడు
పృథ్వీ షా కుటుంబం ముంబై శివారు ప్రాంతమైన విరార్లో ఉండేది. అక్కడి నుంచి తాను నెట్ ప్రాక్టీస్ చేసే చర్చిగేట్ వద్దకు రోజు రెండు గంటలు ప్రయాణం చేసేవాడు. ఆ తర్వాత రాజకీయపార్టీ శివసేన సాయంతో తన కుటుంబాన్ని వెస్ట్ ముంబైలోని శాంతాక్రుయిజ్కు మారాడు. పన్నెండేళ్ల వయసు వచ్చే సరికి పృథ్వీషా గురించి ముంబై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది.
పాఠశాల స్థాయిలోనే అనేక రికార్డులు బద్దలు
అందుకు కారణం పాఠశాల స్థాయి క్రికెట్లో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. 12 ఏళ్ల వయసులో అండర్-14 మ్యాచ్ ఆడుతూ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో 12 ఏళ్లకే క్రికెట్ పరికరాల తయారీ సంస్థ ‘ఎస్జీ' షాతో రూ.36 లక్షలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పృథ్వీషా కుటంబ ఆర్థిక కష్టాలన్నీ తీర్చడంతోపాటు అతడిని పూర్తిగా క్రికెట్కు అంకితం చేయడంలో ఎంతగానో ఉపయోగపడింది.
ఇంగ్లాండ్లో నాలుగు నెలల పాటు
చిన్నవయసులోనే వచ్చిన పేరు, డబ్బు పృథ్వీషా ఆటపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఒకవైపు చదువుకుంటూనే, మరొకవైపు స్కూల్ తరుపున ఆడే టోర్నీలో రికార్డుల మోత మోగించాడు. పృథ్వీషా బ్యాటింగ్ తీరుకి ముగ్ధుడైన ఎన్నారై డాక్టర్ సమీర్ పాఠక్.. క్రికెట్ శిక్షణ కోసం ఇంగ్లాండ్లో నాలుగు నెలల పాటు పర్యటించేందుకు పృథ్వీకి ఉపకార వేతనం వచ్చేలా చేశాడు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగం
ఆ పర్యటన షాకు ఎంతగానో ఉపయోగపడింది. ఇలా క్రికెట్లో పృథ్వీ ఇలా ఎదుగుతున్న దశలోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అతడికి ఉద్యోగం కూడా ఇచ్చింది. ఆ తర్వాత 2012లో మాంచెస్టర్లోని చెడ్లీ హుల్మీ స్కూల్ తరుపున ఇంగ్లాండ్లో ఆడేందుకు పృథ్వీ షాకు ఆహ్వానం అందించింది. సుమారు రెండు నెలల పాటు లండన్లోనే ఉన్న పృథ్వీ షా 1,446 పరుగులు చేశాడు.
14 ఏళ్ల వయసులో వార్తల్లో పృథ్వీ షా
ఆ తర్వాత ఏడాది జులియన్ వుడ్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ జులియన్ వుడ్ పృథ్వీ షాకు ఉచిత ట్రైనింగ్ను ఆఫర్ చేశాడు. 2014లో యార్క్షైర్ ఈసీబీ కంట్రీ ప్రీమియర్ లీగ్లో పృథ్వీ షా క్లీత్రోపీస్ జట్టు తరుపున ఆడాడు. 2013లోనే 14 ఏళ్ల వయసులో పృథ్వీ షా వార్తల్లో నిలిచాడు. ముంబైలో అండర్-16 స్కూల్ టోర్నమెంట్లో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరుపున 300 బంతుల్లో 546 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
సచిన్ రిటైరైన ఆరు రోజులకే పృథ్వీషా ఇన్నింగ్స్
1901 తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న అన్ని రకాల క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు. ఈ ఇన్నింగ్స్తో పృథ్వీషా పేరు మార్మోగిపోయింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రిటైరైన ఆరు రోజులకే పృథ్వీ ఈ ఇన్నింగ్స్ ఆడటం విశేషం. అంతేకాదు 2012, 2013లో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్కు వరుసగా హారిస్ షీల్ట్ టైటిళ్లను అందించాడు.
చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన పృథ్వీ షా
పృథ్వీ షాకు చిన్న వయసులోనే క్రికెట్ ఓనమాలు నేర్పింది.. అతను క్రికెట్ను కెరీర్గా ఎంచుకునేలా చేసింది.. ఎన్నో కష్టాలకు ఓర్చి అతడిని అంతర్జాతీయ క్రికెటర్గా తీర్చిదిద్దింది తండ్రి పంకజ్ షా. తన వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టి కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు పంకజ్. నాలుగేళ్ల వయసులోనే పృథ్వీ తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి అన్నీ తానై వ్యవహరించాడు. కుటుంబానికి నడపడానికి కాకుండా మిగిలిన డబ్బంతా పృథ్వీ శిక్షణకే వినియోగించాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులెదురైనా కొడుకు కెరీర్ విషయంలో మాత్రం రాజీ పడలేదు. షాను ప్రతి దశలోను ఎంకరేజ్ చేయడంతో ఈరోజు అతడు ఈ స్థాయికి చేరుకున్నాడు.