చాలా మంది అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది
నరేంద్ర మోదీ మాట్లాడుతూ..'క్రీడల విషయానికి వస్తే నేనొకటి చెప్పదల్చుకున్నాను. భారతదేశం తరఫున అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకరైన మిథాలీ రాజ్ గురించి నేను ఇవాళ ప్రస్తావించదలుచుకుంటున్నాను. ఆమె ఈ నెల ప్రారంభంలో తన రిటైర్మెంట్ ప్రకటించింది. ఇది చాలా మంది అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. మిథాలీ అసాధారణ క్రీడాకారిణి మాత్రమే కాదు.. ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మిథాలీ తదుపరి భవిష్యత్తుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను' అంటూ ప్రధాని ముగించారు.
రెండు సార్లు భారత్ను ప్రపంచకప్ ఫైనల్ చేర్చిన మిథాలీ
1999లో జూన్లో ఐర్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ అరంగేట్రం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్లో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్లో ఆమె టీమిండియాకు కెప్టెన్సీ వహించింది. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరుకోలేకపోయింది. ఆమె కెప్టెన్సీలోనే 2017 ఐసీసీ మహిళల ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్తో త్రుటిలో ఇండియా ఓడిపోయింది. ఇక 2005లో కూడా ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా జట్టుకు మిథాలీ కెప్టెన్గా వ్యవహరించింది. ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఇండియా ఓటమి పాలయింది.
మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో కొన్ని అత్యుత్తమ రికార్డులు
అత్యధిక కాలం వన్డే కెరీర్ కొనసాగించిన ప్లేయర్ (పురుషులు/మహిళలు) - 22సంవత్సరాల 274రోజులు.
వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు - 7805
వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు - 232
రెండుసార్లు వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్కు నాయకత్వం వహించిన ఏకైక భారత కెప్టెన్ మిథాలీ రాజ్.
వుమెన్స్ టెస్ట్ క్రికెట్లో అతి చిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్.