తరలి వచ్చిన పాకిస్తాన్ అతిరథులు
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కుమారుడు సులేమాన్ ఖాన్ లార్డ్స్ స్టేడియంలో సందడి చేస్తూ కనిపించారు. మ్యాచ్ ఆరంభానికి గంట ముందే సులేమాన్ ఖాన్ తన స్నేహితులు, పాక్ అధికారులతో కలిసి లార్డ్స్ మైదానానికి చేరుకున్నారు. స్టేడియం బయటే కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడానికి ఆయన మొహమాట పడ్డారు. దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ మ్యాచ్ను చూడటానికి ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ బజ్వా సైతం లార్డ్స్ మైదానానికి చేరుకున్నారు. మ్యాచ్ ఆరంభం ముందు నుంచే ఆయన స్టేడియంలోని వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ను తిలకిస్తున్నారు. పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు విభాగం ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ (ప్రజా సంబంధాలు) మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఎహసాన్ మణి తదితరులు లార్డ్స్ స్టేడియానికి వచ్చారు.
దక్షిణాఫ్రికాకు చావో, రేవో..
ఈ మ్యాచ్ ఫలితం పాకిస్తాన్కు ఎలా ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికాకు మాత్రం చావో, రేవో అనేలా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తే.. దక్షిణాఫ్రికా తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. లేదంటే- సెమీ ఫైనల్కు చేరడం దాదాపు అసాధ్యమౌతుంది ప్రోటీస్కు. ఈ నేపథ్యంలో- పాకిస్తాన్పై గెలిచి తీరాలనే కసితో ఆడుతోంది దక్షిణాఫ్రికా జట్టు. పాకిస్తాన్కు సైతం ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్యగా మారింది. కిందటి ఆదివారం మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్లో భారత్తో జరిగిన మ్యాచ్లో అత్యంత అవమానకరంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఏ స్థాయిలో విమర్శలు చెలరేగాయో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
పాకిస్తాన్కు ప్రతిష్ఠాత్మకం
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మ్యాచ్లో అంతే పేలవమైన ప్రదర్శన చేసింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో నాసిరకం ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా- భారత క్రికెట్ జట్టు చేతిలో డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తన తరువాతి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో ఆడుతోంది. లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ మైదానంలో మ్యాచ్ సాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 15 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ఓపెనర్ ఫకర్ జమాన్ అవుట్ అయ్యాడు. 50 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేసిన ఫకర్.. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో హషీమ్ ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ.. మెరుగైన రన్రేట్తో మ్యాచ్ను ఆడుతోంది సర్ఫరాజ్ అహ్మద్ టీమ్. మరో ఓపెనర్ ఇమాముల్ హక్.. 55 బంతుల్లో 44 పరుగులతో ఆడుతున్నాడు.
పాక్ జట్టులో రెండు మార్పులు..
ఊహించినట్టే పాకిస్తాన్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్, పేస్ బౌలర్ హసన్ అలీలను రిజర్వ్ బెంచ్కు పరిమితం చేసింది పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్. వారి స్థానంలో హ్యారిస్ సొహైల్, షెహెన్షా అఫ్రిదీలకు తుది జట్టులో చోటు కల్పించింది. షోయబ్ మాలిక్ వరుస మ్యాచుల్లో విఫలం కావడంతో అతణ్ని ఆడనివ్వలేదు టీమ్ మేనేజ్మెంట్. రెండు మ్యాచుల్లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు షోయబ్ మాలిక్. అలాగే- హసన్ అలీని కూడా తప్పించింది. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడీ ఫాస్ట్ బౌలర్. ప్రత్యేకించి భారత్తో జరిగిన మ్యాచ్లో బ్యాట్స్మెన్లు. అతణ్ని ఓ ఆడ ఆడుకున్నారు. తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులను ధారాదాత్తం చేశాడు హసన్ అలీ. ఈ నేపథ్యంలో వారిద్దరినీ పక్కన పెట్టింది మేనేజ్మెంట్. కొత్తవారికి అవకాశాన్ని కల్పించింది.