ఈ మ్యాచ్లోనూ వాళ్లు బెంచ్కే
ఈ టోర్నీలో రిజర్వ్ బెంచ్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా భారత్ ఈ టోర్నీకి అందరూ కుర్రాళ్లను ఎంపిక చేసింది. కానీ మూడు మ్యాచ్లు పూర్తయినా ఇంక కొంత మందిని పరీక్షించనే లేదు. ఆరంభ మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓటమి పాలైన తర్వాత తుదిజట్టు ఎంపికలో భారత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. దీపక్ హుడా, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ టోర్నీలో ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయారు. ఈ మ్యాచ్లోనూ వాళ్లు బెంచ్కే పరిమితమయ్యేలా ఉన్నారు. దాంతో, ఈ టోర్నీకి ద్వితీయ శ్రేణి జట్టును పంపిన సెలెక్టర్ల ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరనట్టే కనిపిస్తోంది.
రోహిత్ శర్మ వైఫల్యం కారణంగానే
కెప్టెన్ రోహిత్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు శిఖర్ ధావన్ మెరుగ్గా రాణిస్తున్నా రోహిత్ శర్మ వైఫల్యం కారణంగా జట్టుకు శుభారంభాలు దక్కడం లేదు. గత మూడు మ్యాచ్ల్లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. ఒక మంచి ఇన్నింగ్స్తో రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. రైనా ఫర్వాలేదనిపిస్తున్నా.. ఐపీఎల్ మెరుపులు చూపెట్టలేకపోతున్నాడు. మిడిలార్డర్ భారాన్ని మనీష్ పాండే, దినేశ్ కార్తీక్ పంచుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్లో లోకేశ్ రాహుల్ను ఓపెనర్గా పంపించి కెప్టెన్ రోహిత్ నాలుగో నెంబర్లో ఆడతాడేమో చూడాలి.
అద్భుతాలు చేస్తోన్న శార్దూల్ ఠాకూర్
ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆల్ రౌండర్ పాత్రకు విజయ్ శంకర్ మరింత న్యాయం చేయాల్సి ఉంది. గత రెండు మ్యాచ్ల్లో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయిన జయదేవ్ ఉనాద్కత ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఊహించని రీతిలో అద్భుతాలు చేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో సుందర్, చాహల్.. ప్రత్యర్థులను నిలువరిస్తే భారత్డ విజయావకాశాలు చాలా మెరుగవుతాయి. మొత్తంగా ఈ మ్యాచ్లో అన్ని రంగాల్లో రాణిస్తే తప్ప భారత్కు ఈ గెలుపు అంత సులువు కాకపోవచ్చు.
ఆత్మవిశ్వాసం బంగ్లాదేశ్
ఈ మ్యాచ్ కోసం బంగ్లా భారీ మార్పులు చేసేందుకు ఇష్టపడకపోయినా.. ఒకటి, రెండు అవకాశాలను మాత్రం పరిశీలిస్తున్నారు. లంకపై 215 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంతో బంగ్లా జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ మ్యాచ్లో భారత్ను ఓడిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపడుతాయి. కాబట్టి ఏమాత్రం అలసత్వం లేకుండా ఆడాలని ప్రణాళికలు రచిస్తోంది. బంగ్లా ఆటగాళ్లు లిట్టన్ దాస్, తమీమ్లు చక్కటి ఫామ్లో ఉన్నారు. ఇక కెప్టెన్ మహ్మదుల్లా సుడిగాలి ఇన్నింగ్స్ బంగ్లాకు లాభించే అంశం. టోర్నీ ఆరంభంతో పోలిస్తే బంగ్లా బౌలింగ్ కూడా గాడిలో పడింది. ముస్తాఫిజుర్, రూబెల్ పవర్ప్లే, స్లాగ్ ఓవర్లలో ఆకట్టుకుంటున్నారు. బౌలర్లు మెహిది హసన్, నజ్ముల్ ఇస్లామ్ మ్యాజిక్ చేస్తే భారత్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
నెట్ రన్రేట్ కీలకం
ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే ఇతర సమీకరణాలతో అవసరం లేకుండా నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం.. శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ ఫలితంపై టీమిండియా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నెట్ రన్రేట్ కూడా ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం భారత్ 4, లంక, బంగ్లాదేశ్ చెరో 2 పాయింట్లతో ఉన్నాయి. వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్ నెట్ రన్రేట్ +0.21 కాగా, లంక -0.072, బంగ్లా -0.231 గా ఉంది. ఈ మ్యాచ్లో బంగ్లా గెలిచి ఆఖరి మ్యాచ్లో లంక చేతిలో ఓడితే అప్పుడు అందరి ఖాతాలో 4 పాయింట్ల చొప్పున ఉంటాయి. కాబట్టి నెట్ రన్రేట్ కీలకం అవుతుంది.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్కు స్వర్గధామం. భారీ స్కోర్లు చేయవచ్చు. వర్షం ముప్పు కూడా పొంచి ఉంది.
జట్ల వివరాలు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, రాహుల్, రైనా, మనీష్, కార్తీక్, విజయ్ శంకర్, సుందర్, చాహల్, శార్దూల్, ఉనాద్కత్
బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), తమీమ్, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, రెహమాన్, హక్, మెహిది హసన్, ముస్తాఫిజుర్, టస్కిన్, జాయేద్, రూబెల్ హుస్సేన్, నజ్ముల్ ఇస్లామ్.