ఒక్క మ్యాచ్ గెలిస్తే సిరిస్ భారత్ సొంతం
డర్బన్లో 6 వికెట్లు, సెంచూరియన్లో 9 వికెట్లు, కేప్టౌన్లో 124 పరుగుల తేడాతో ఆతిథ్య సఫారీ జట్టుపై కోహ్లీసేన విజయం సాధించింది. నాలుగో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆరు వన్డేల సిరీస్లో ప్రస్తుతం భారత్ 3-1తో ఆధిక్యంలో ఉంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే సిరిస్ భారత్ సొంతం అవుతుంది. అయితే ఐదో వన్డే జరిగే సెయింట్ జార్జ్ పార్క్లో భారత్ ట్రాక్ రికార్డు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఐదు మ్యాచుల్లోనూ భారత్ ఓటమి
1992 నుంచి ఇక్కడ జరిగిన ఐదు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. అంతేకాదు ఈ నాలుగు మ్యాచ్ల్లో ఒక్కదాంట్లో కూడా 200కు పైగా పరుగులు నమోదు చేయలేకపోయింది. సఫారీ పర్యటనలో ఓపెనర్ రోహిత్ శర్మ వైఫల్యం అభిమానులను కలవరపెడుతోంది. ఆరు సార్లు రబాడ బౌలింగ్లోనే ఔటయ్యాడు. ఇక, నాలుగో స్థానంలో ఆడుతున్న రహానే తొలి వన్డేలో 79 పరుగులు చేసినా తర్వాత మ్యాచుల్లో 11, 8 మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.
నిరాశ పరుస్తున్న రోహిత్ శర్మ, పాండ్యా
ఒకదాంట్లో అతడికి ఆడే అవకాశం రాలేదు. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఆశించిన మేరకు రాణించడం లేదు. తొలి వన్డేలో 3 నాటౌట్, మూడో వన్డేలో 14, నాలుగో వన్డేలో 9 పరుగులు చేశాడు. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే నాలుగు మ్యాచ్లు కలిపి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు వన్డేల్లో కెప్టెన్ కోహ్లీ (393), ఓపెనర్ శిఖర్ ధావన్ (271)లు మాత్రమే రాణిస్తున్నారు.
ధోని ముంగిట రెండు మైలురాళ్లు
సఫారీ పర్యటనలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో రెండు మైలురాళ్లకు అడుగు దూరంలో నిలిచాడు. అందులో ఒకటి పదివేల పరుగులు చేయడానికి ఇంకా 46 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ధోని 9,954 వన్డే పరుగులతో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీని సాధిస్తే, పదివేల పరుగుల మైలురాయిని ధోని అందుకోనున్నాడు. రెండో మైలురాయి విషయానికి వస్తే వన్డేల్లో ఇప్పటి వరకు ధోని 295 క్యాచ్లను పట్టాడు. మరో ఐదు క్యాచ్లు పడితే మూడొందల క్యాచ్లు పట్టిన ఏకైక భారత వికెట్ కీపర్గా ధోని అరుదైన ఘనత సాధిస్తాడు.
స్పిన్నర్ల స్వర్గధామం పోర్ట్ ఎలిజబెత్
ఇక, ఐదో వన్డే జరగనున్న పోర్ట్ ఎలిజబెత్ స్పిన్నర్ల స్వర్గధామం. ఇక్కడ ఆతిథ్య జట్టు ఆడిన చివరి రెండు వన్డేల్లో స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. 2017లో శ్రీలంకపై ఇమ్రాన్ తాహిర్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 2016 అక్టోబర్లో ఆస్ట్రేలియాపై షంషీ 3/36తో నిలవగా... మరో స్పిన్నర్ ఆరోన్ ఫంగిసో 2/17తో రాణించాడు. పోర్ట్ ఎలిజబెత్లో ఆడిన ఐదు మ్యాచుల్లో భారత్ సాధించిన అత్యధిక పరుగులు 176. దక్షిణాఫ్రికాపై 2001లో ఆ పరుగులు సాధించింది. ఈ స్టేడియంలో జరిగిన ఓ మ్యాచ్లో టీమిండియా.. కెన్యాపై కూడా ఓటమి పాలైంది. ఇక, సఫారీల విషయానికి వస్తే ఇక్కడ 32 మ్యాచ్లు ఆడగా 11 మాత్రమే ఓటమిపాలైంది.
పోర్ట్ ఎలిజిబెత్లో భారత ఓటమి పరంపర ఇదీ
* అజారుద్దీన్ నేతృత్వంలోని టీమిండియా తొలిసారి ఈ స్టేడియంలో 1992లో తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 147 ఆలౌటై 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
* 1997లో సచిన్ నేతృత్వంలో ఆడిన భారత్ 179 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా 45.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
* 2006లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని టీమిండియా ఈ పిచ్పై మూడో వన్డే ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 243 పరుగులు చేయగా, అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 163 పరుగులకే ఆలౌటైంది.
* చివరి సారిగా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో 2011లో భారత్ ఈ స్టేడియంలో ఆడింది. అప్పుడు కూడా భారత్ 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
|
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్
దక్షిణాఫ్రికా: అయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హషీమ్ ఆమ్లా, జేపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్, డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరిస్, లుంగి ఎంగిడి, అండిలే ఫెలుక్వాయే, రబాడ, తబ్రైజ్ షంషీ, జొండొ, ఫర్హాన్ బెహార్డీన్, హెన్రిచ్ క్లాసెన్, ఏబీ డివిలియర్స్
Match starts at: 4:30 pm IST
Live on: Sony TEN 1, Sony TEN 1 HD