
దుబాయ్: కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రికెట్ టోర్నీలు జరగలేదు. అయితే అనేక దేశాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్ను పునరుద్దరించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భావిస్తోంది. రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు వెంటనే మైదానంలోకి దిగితే.. ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేదానిపై ఐసీసీ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా బౌలర్ల గురించి.
ఏదేమైనా క్రికెటర్లు, సహాయ సిబ్బంది ఆరోగ్యం, భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఐసీసీ తెలిపింది. ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వెల్లడించింది. ఇక బౌలర్లు గాయపడకుండా ఉండేందుకు సూచనలు చేసింది. క్రికెట్లో ఎక్కువగా బౌలర్లు గాయపడేందుకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. వారు ఎక్కువగా పరుగెత్తాలి. ఫిట్నెస్ స్థాయి అత్యుత్తమంగా లేకపోతే కష్టం.
'లాక్డౌన్ విరామంలో అనేక మంది ఆటగాళ్లు ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో చిన్నపాటి వ్యాయామాలకే కొంత మంది ఆటగాళ్లు పరిమితమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి దిగితే గాయాలబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలర్ల గురించే ఎక్కువ ఆందోళనగా ఉంది' అని ఐసీసీ పేర్కొంది. 'బౌలర్లకు టెస్టు క్రికెట్ ఆడేందుకు కనీసం 8-12 వారాల సన్నద్ధత అవసరం. చివరి 4-5 వారాల్లో అంతర్జాతీయ స్థాయిలో తీవ్రత కొనసాగించాలి. తక్కువ సమయం సాధన చేసి ఆడితే బౌలర్లు గాయపడతారు. వయసు, శారీరక శ్రమను పరిగణనలోకి తీసుకొని శిక్షణ పొందాలి' అని ఐసీసీ తెలిపింది.
షెడ్యూలు ప్రకారం ఆగస్టులో పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్లో పర్యటించాలి. మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ పోటీలు ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశముంది. దీంతో స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ సహా 18 మంది ఇంగ్లిష్ బౌలర్లు ఇప్పటికే తమ కౌంటీ మైదానాల్లో వ్యక్తిగతంగా సాధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20లు ఆడేందుకు 5-6 వారాలు, వన్డేలు ఆడేందుకు 6 వారాల సన్నద్ధత అవసరమని ఐసీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆటగాళ్లను 14 రోజుల క్వారంటైన్, మైదానంలో భౌతిక దూరం, ఒకరి వస్తువులు మరొకరు వాడొద్దనే నిబంధనలను కూడా ఐసీసీ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.