జనతా కర్ఫ్యూ:
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ కోరారు. అత్యవసరమైతే తప్పితే అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు. ప్రధాని విన్నపాన్ని స్వాగతిస్తూ భారత క్రికెటర్లు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటించాలని సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్లు ట్వీట్లు చేశారు.
కరోనాపై చేసే పోరాటంలో..:
'కరోనా వైరస్పై ప్రధాని మోదీ చేసిన సూచన చాలా ముఖ్యమైనది. కరోనా నిరోధానికి జనతా కర్ఫ్యూతో దేశం యుద్ధాన్ని ప్రకటించిన క్రమంలో ప్రధాని సూచనను అంతా పాటించాలి' అని కైఫ్ కోరాడు. ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని యువీ అన్నాడు. దీనిపై ప్రధాని మోదీ ట్వీట్తో స్పందించారు. మరో భాగస్వామ్యానికి సమయం వచ్చింది, కరోనాపై పోరాటానికి భారత్ మొత్తం భాగస్వామ్యం కావాలన్నారు.
మరో భాగస్వామ్యానికి సమయం వచ్చింది:
'ఇక్కడ ఇద్దరు (కైఫ్, యువరాజ్) అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. వారి భాగస్వామ్యం మనం ఎప్పటికీ మరవలేనిది. వారు చెప్పినట్లుగా ఇప్పుడు మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పడానికి సమయం వచ్చింది. అయితే ఈ సారి కరోనాపై చేసే పోరాటంలో యావత్ భారత్ మొత్తం భాగస్వామ్యం అవ్వాలి' అని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2002లో నాట్వెస్ట్ ఫైనల్లో భారత్ 326 పరుగుల టార్గెట్ను ఛేదించి విజయం సాధించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.
|
యువీ-కైఫ్ పోరాటం:
2002లో జరిగిన నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లండ్ 326 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన టీమిండియా 146 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే యువీ-కైఫ్ కలిసి ఆరో వికెట్కు 121 పరుగులు జోడించారు. యువీ 69 పరుగులు చేసి ఔటవ్వగా.. కైఫ్ (87) చివరి వరకూ క్రీజ్లో ఉండి మ్యాచ్ను గెలిపించాడు. టెయిలెండర్ల సాయంతో మ్యాచ్ను గట్టెక్కించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇదో గొప్ప విజయంగా పరిగణిస్తారు. ఆ మ్యాచ్ విజయం తర్వాత అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన చొక్కా విప్పేసి మరీ సంబరాలు చేసుకున్నారు.