హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత పాక్పై సర్జికల్ స్ట్రైక్స్-2తో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ వేదికగా జూన్ 16న మాంచెస్టర్లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై అనిశ్చితి ఏర్పడింది.
పాక్ను ఒంటరిని చేయాలి: 20 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా క్రికెట్కు ఎలా దూరమైందో!
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్ కప్లో పాక్తో భారత్ మ్యాచ్ ఆడకూడదని కొందరు క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న దేశంతో సంబంధాలు తెంచుకోవాలని ఐసీసీ సభ్య దేశాలను బీసీసీఐ కోరింది. వరల్డ్ కప్లో ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల సంక్షేమం, పటిష్ట భద్రత కోసం లేఖ కూడా రాసింది.
ఇలాంటి సమయంలో దుబాయి వేదికగా బుధవారం ఐసీసీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం లేదా శనివారం జరుగనున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ త్రైమాసిక సమావేశంలో భారత్-పాక్ పంచాయతీ చర్చకు రానుంది. ఈ సమావేశంలో భారత్ అభ్యంతరాలపై పాక్ గట్టి కౌంటర్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.
భారత్ కోరుకున్నట్టే లీగ్ దశలో టీమిండియాతో మ్యాచ్లు ఆడమని... కానీ, నాకౌట్ దశలో ఇరు జట్లు ఎదురుపడితే అప్పుడేం చేస్తారనే ప్రశ్నను పాక్ క్రికెట్ బోర్డు ఈ సమావేశంలో లేవనెత్తనుందని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలే సఫారీ పర్యటనలో దక్షిణాఫ్రికా క్రికెటర్పై జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన పాక్ కెప్టెన్ సర్పరాజ్పై ఐసీసీ నాలుగు మ్యాచ్ల నిషేదం విధించింది.
అలాంటిది వరల్డ్కప్లో పాక్తో తమతో ఆడమని చెబుతోన్న భారత్ను ఐసీసీ ఎందుకు నిలయదీయడం లేదో పీసీబీ ఈ సమావేశంలో ప్రశ్నించనుంది. వరల్డ్కప్లో పాక్తో ఆడటంపై బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం పాక్తో మ్యాచ్ ఆడకూడదని ఆదేశిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడుతామని తేల్చి చెప్పింది.