భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 టోర్నీ: ఆ రెండు జట్లు కూడా: పీసీబీ సంచలనం..ఐసీసీకి ప్రపోజల్స్

ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగడం అసాధారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే మెగా టోర్నమెంట్లల్లో తప్ప మరెక్కడా ఈ రెండు జట్లు తలపడటాన్ని మనం చూడలేం. ద్వైపాక్షిక సిరీస్ గానీ, పర్యటనలు గానీ ఉండట్లేదు. కాశ్మీర్ సహా అనే విషయాల్లో భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణం. అక్కడి అనిశ్చిత పరిస్థితులు, భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రికెట్ ఆడే దేశాలు పాకిస్తాన్ పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

పీఎస్ఎల్తో..
చాలాకాలం పాటు పాకిస్తాన్లో పర్యటించడానికి వెనుకాడాయి. ఐపీఎల్ తరహాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ను డిజైన్ చేసుకున్న తరువాత కొంత మార్పు మొదలైంది. వెస్టిండీస్ వంటి కొన్ని దేశాలు పాకిస్తాన్లో పర్యటించాయి. పలు దేశాల ప్లేయర్లు సూపర్ లీగ్లో ఆడుతున్నారు. పీఎస్ఎల్ మెగా టోర్నమెంట్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దృష్టి సారించలేదు. దానిపై అసలు ఫోకస్ పెట్టలేదు. భారత ప్లేయర్లెవరూ అక్కడి ఫ్రాంఛైజీల్లో ఆడట్లేదు.

ఏడాదికోసారి టోర్నీ..
నిజానికి భారత్-పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. దాని రేంజ్ వేరుగా ఉంటుంది. క్రికెట్కు మించి.. అనేలా చూస్తారు రెండు దేశాల ప్రజలు కూడా. కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంగా భావిస్తుంటారు. ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్, టీ20 వరల్డ్కప్, ఆసియాకప్లల్లో తప్ప ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు ఉండవు. అలాంటి ఈ రెండు జట్ల మధ్య తరచూ క్రికెట్ మ్యాచ్లు జరిగితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

ఐసీసీ అనుమతుల కోసం..
తన ఆలోచనలను పేపర్ల మీద పెట్టింది. ఓ టోర్నమెంట్ను డిజైన్ చేసింది. అనుమతుల కోసం ఐసీసీకి పంపించింది కూడా. ధనాధన్ ఫటాఫట్ ఫార్మట్ టీ20ల్లో ప్రత్యేకంగా ఓ వార్షిక టోర్నమెంట్ను తటస్థ వేదికల మీద దీన్ని నిర్వహించేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా ఈ ప్రతిపాదనలను రూపొందించారు. ఆసియా కప్ తరహాలో టీ20 స్పెషల్ టోర్నమెంట్ను నిర్వహించడానికి అనుమతులు ఇవ్వాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశారాయన.

650 మిలియన్ డాలర్ల ఆదాయం..
భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా- జట్లు మాత్రమే ఆడేలా ఈ టోర్నమెంట్కు రూపకల్పన చేశారు. ఈ టోర్నమెంట్ను నిర్వహించడం వల్ల ఎంత లేదనుకున్నా 650 మిలియన్ డాలర్ల ఆదాయం ఉంటుందని అంచనా వేశారు. వచ్చేవారం దుబాయ్లో ఐసీసీ నిర్వహించే సమావేశంలో ఈ ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. పాకిస్తాన్ తరఫున రమీజ్ రాజా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫైసల్ హస్నయిన్ ఈ భేటీకి హాజరు కానున్నారు. దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

సింగిల్ లీగ్ స్ట్రక్చర్..
సింగిల్ లీగ్ స్ట్రక్చర్లో దీన్ని డిజైన్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. ఆరు లీగ్ మ్యాచ్లు ఉంటాయి. ఆన్ ఆఫ్ లేదా బెస్ట్ ఆఫ్ త్రీ రూపంలో ఫైనల్స్ నిర్వహించాల్సి ఉంటుందని ఈ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా తటస్థ వేదికల మీద.. ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ను నిర్వహించడం వల్ల ఈ నాలుగు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత మెరుగుపడతాయని స్పష్టం చేసింది. ప్రారంభంలో 650 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, దాన్ని నాలుగు దేశాల క్రికెట్ బోర్డులు పంచుకోవచ్చని పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications